సజ్జనార్ గారూ…ఆలేరులో డీలక్స్ బస్సులను ఆపమనలే రా?
ప్రయాణికులను బస్టాండ్ లలో వదిలేసి దాబాల దగ్గర అరగంటకు పైగా అపడం న్యాయమా!
ఆర్టీసికి ఆదాయం దాబాల నుండే వస్తుందా – ఆర్.జనార్ధన్, పసూపునూరి వీరేశం అఖిలపక్ష నాయకులు
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 05
వరంగల్, హన్మకొండ ,తదితర డిపోలకు చెందిన డీలక్స్ బస్సులను వయా ఆలేరు బస్టాండ్ మీదుగా నడిపించాలని,వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ లకు ఆలేరు అఖిల పక్ష నాయకులు,ప్రజలు ఎన్నో సార్లు కలిసి విన్నవించినప్పటికి ఉపయోగం లేకుండాపోయిందని ఆలేరు అఖిలపక్ష నాయకులు ఆర్.జనార్ధన్,పసుపునూరి వీరేశం లు ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్ హన్మకొండ తదితర ఆర్టీసీ డిపోలకు సంబందించిన డీలక్స్ బస్సులను ఆలేరులో ఆపకుండా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రయాణికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఆలేరు అఖిల పక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం ఎన్నో సార్లు వరంగల్ రీజియన్ పరిధిలోని మేనేజర్లకు ఆలేరులో డీలక్స్ బస్సులను ఆపాలని విన్నవించినప్పటికి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని, ఆర్టీసీ అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ఉదయం నుండి రాత్రి వేళలలో ఆలేరు నుండి హైదరాబాద్,వరంగల్ హన్మకొండ తదితర ప్రాంతాలకు ప్రతి నిత్యం ప్రజలు,వ్యాపారులు ఇతర వర్గాల ప్రజలు అవసరాల నిమిత్తం అనేక మంది అనేక సార్లు ప్రయాణాలు చేస్తుంటారని, ఇలాంటి సమయంలో రాత్రి వేళల్లో ఆలేరుకు రావాలంటే డీలక్స్ బస్సులను ఆలేరు లోకల్ నుండి కాకుండా బైపాస్ నుండి తీసుకుపోవడంతో ప్రయాణికులు ఉన్నచోటనే ఏ ఫుట్ పాత్ మీదనో,బస్టాండ్ లల్లో రాత్రి వేళలో ఉండాల్సి వస్తుందని అన్నారు. అయినా ఆర్టీసీ అధికారులకు,ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు కనీసం స్పందించకుండా ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు.
చివరికి ఆర్టీసి ఎండీ సజ్జనార్ కు కూడా అనేక సందర్భాలలో అఖిలపక్షం,ప్రజలు చేసిన ఆందోళనల న్యూస్ పేపర్ ల వార్త కటింగ్ లను, రీజియన్ మేనేజర్ లను కలిసి ఇచ్చిన వినతి పత్రాలను పంపించడం జరిగిందని,అయినా ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు.
చుట్టం చూపు లాగా ఒకటి అర తప్ప డీలక్స్ బస్సులు ఆలేరు పట్టణానికి ఎంటర్ కాకుండానే బైపాస్ నుండి వెళ్లిపోతున్నాయని డ్రైవర్లు కండక్టర్లు వారి ఇష్టానుసారంగా ఆలేరు టౌనుకు దూరంగా దాబాల దగ్గరైతే అరగంటకు పైగానే పైగానే ఆపుకుంటున్నారని దీనిపై ఎవ్వరూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు.ఆలేరు బస్టాండులోకి రావడానికి మాత్రం వారికి సమయం చాలడం లేదని అన్నారు.
నామమాత్రంగా ఆలేరుకు వచ్చే డీలక్స్ బస్సుల వల్ల ఆలేరు నుండి హైదరాబాద్ వరంగల్ హన్మకొండ తదితర ప్రాంతాలకు పోయి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఉపయోగం లేదని ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప మరేమీ కాదని అన్నారు. ఆలేరు అఖిల పక్ష పార్టీల బృందం అనేక సార్లు వరంగల్ రీజియన్ మేనేజర్లను కలిసి ఆలేరు లో డీలక్స్ బస్సులను ఆపాలని వినతిపత్రాలు ఇచ్చినపుడు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెపుతున్నారే గానీ, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. ఇలాగే ఆలేరులో డీలక్స్ బస్సులను ఆపకుండా బైపాస్ మీదుగా వెళ్ళినట్లైతే ఆర్టీసీ బస్సులను అడ్డుకోకునే స్థితిని కల్పించవద్దని,ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి,ఆలేరు లు డీలక్స్ బస్సులను ఆపాలని కోరారు.