ప్రజావాణి ఫిర్యాదుపై స్పందించిన ఎల్.డి.ఎం
బ్యాంకు మేనేజర్ల వేధింపులపై ఫిర్యాదు చేసిన ఏవిఎస్పి నాయకురాలు మడకం సమ్మక్క
రేపు దుమ్ముగూడెం మండలంలో బ్యాంకులకు వస్తున్నట్లు చరవాణి ద్వారా తెలియజేసిన ఎల్.డి.ఎం
(సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 15)
కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఒక ఫిర్యాదుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ స్పందించారు. రేపు దుమ్ముగూడెం మండలం లో బ్యాంకులను సందర్శిస్తున్నట్లు ఫిర్యాదుదారుకి స్వయంగా చరవాణి ద్వారా సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వ్యవసాయ అవసరాల కోసం కొరకు ఆయా మండలాల పరిధిలోని ఎస్బిఐ, ఏపిజివిబి మరియు డీసీసీబీ సహకార బ్యాంకుల్లో ఖాతాలు పొంది ఋణ సదుపాయములు పొందుతున్నారని ఇవే బ్యాంకు ఖాతాలకు పెన్షను రైతుబందు వంటి ప్రభుత్వ పథకాల ఆర్థిక సహాయాల కోసం ఉపయోగిస్తున్నారని అయితే బ్యాంకు అధికారులు మాత్రం గిరిజనులపై వివక్ష చూపిస్తూ అమాయక గిరిజనులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని గిరిజనులకు వారు బ్యాంకు లావాదేవీల వివరాలు ఏవి కూడా చెప్పడంలేదని గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని హీనంగా చూస్తూ వారికి తెలియని అప్పులను చూపిస్తూ అమాయక గిరిజనులు యొక్క బ్యాంకు ఖాతాలను హోల్డులో పెడుతున్నారని ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్ దుమ్ముగూడెం మండలం అధ్యక్షురాలు మడకం సమ్మక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వం ఇస్తున్న వృద్ధ్యాప్య పెన్షను వితంతు పెన్షనులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబందు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పి.ఎం కిసాన్ సహాయాలను సైతం ఇవ్వకుండా అప్పు పూర్తిగా కడితేనే అకౌంట్ హోల్డులో నుండి తీస్తామని బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ గురించి అడిగితే మీకు రుణమాఫీ రాదని అప్పు మొత్తం కట్టాలని లేకపోతే ఖాతాలలో ఉన్న ఒక్క రూపాయి కూడా బయటకు రాదని చెప్పడంతో పాటు లబ్దిదారుల ఖాతాల యొక్క స్టేట్మెంట్ వివరాలు అడిగితే ఒక్కో పేజీకి 100/- రూ. ల నుండి 250/- రూ.ల వరకు ఖర్చు అవుతుందని అధిక మొత్తంలో డబ్బు అడుగుతున్నారని లేదంటే బ్యాంకు స్టేట్మెంట్ ఇవ్వడానికి పైనుంచి అనుమతులు రావాలంటూ అమాయకులైన గిరిజనులను బ్యాంకుల నుండి వెళ్లగొడ్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలోనూ గిరిజన ప్రజలు రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని గిరిజనుల అమాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఖాతాలు సక్రమంగా ఉన్నాయో లేవో కూడా విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్షరం జ్ఞానం లేని గిరిజనుల పట్ల అమర్యాదగానూ అనుచితంగానూ ప్రవర్తిస్తున్న బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మడకం సమ్మక్క ఫిర్యాదులో కోరింది. ఈ ఫిర్యాదుపై లీడ్ బ్యాంకు మేనేజర్ స్పందించి ఏవిఎస్పి నాయకురాలు మడకం సమ్మక్కను చరవాణి ద్వారా సంప్రదించి రేపు దుమ్ముగూడెం మండలంలో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు.
సమస్యలు ఉన్నవారు బ్యాంకుకు వస్తే వెంటనే వారు సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు ఈ అవకాశాన్ని దుమ్ముగూడెం మండలంలోని గిరిజనులు వినియోగించుకోవాలని సి కే న్యూస్ తో ఫిర్యాదుదారు అయిన ఏవిఎస్పి నాయకురాలు మడకం సమ్మక్క తెలియజేశారు.