పట్టపగలే దొంగలు హల్చల్….
సికె న్యూస్ ప్రతినిధి
వరంగల్ నగరంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తవాడ బ్యాంక్కాలనీలోని సాంబారి రాజశేఖర్ ఇటీవల సింగపూర్ కు వెళ్లారు.
ఇదే ఇంట్లో కిరాయికి ఉంటున్న గంగుల సంతోష్ కూడా మేడారం జాతరకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఇదే అదనుగా తీసుకున్న దొంగలు వీరంగం సృష్టించారు. తాళం వేసి ఉండడాన్ని గుర్తించిన దొంగలు తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తాళం తీసి ఇంట్లో అణువణువు వెతికారు. రాజశేఖర్ ఇంట్లో రెండు తులాల బంగారం, 1.25 కిలోల వెండి ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు.
వాటి విలువ రూ. 2లక్షల 17 వేలు ఉంటుందని బాధితులు తెలిపినట్లు తెలుస్తోంది. అలాగే కిరాయికి ఉంటున్న సంతోష్ ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో వస్తువులన్నీ చిందరవందరగా పడేసినట్లు కనిపిస్తున్నాయి.
ఇట్టి విషయాన్ని స్థానికులు గమనించి, కేకలు వేయడంతో దొంగలు ఉడాయించారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ సీఐ గోపి తెలిపారు. మేడారం జాతర నేపథ్యంలో పలువురు కుటుంబ సమేతంగా ఇళ్లకు తాళం వేసి వెళ్తున్నారు.
ఈ క్రమంలో దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తమ ఏరియాల్లో కొత్తవారు లేదా అనుమానితులు ఎవరు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.