స్టేషన్కు వచ్చిన మహిళకు ఎస్సై వేధింపులు
నేను చెప్పినట్లు చేస్తే కేసు పరిష్కారిస్తా…ఎస్సై
భూ వివాదంలో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్లిన తనను ఎస్సై వేధించారంటూ ఓ మహిళ నల్లగొండ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
‘నీ భర్తతో దూరంగా ఎందుకు ఉంటున్నావు? నాతో సఖ్యతగా ఉంటే పూర్తిగా సహకరిస్తా. అలాగైతేనే కేసు పరిష్కరిస్తా’ అని ఎస్సై పేర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. వివరాలిలా ఉన్నాయి..
శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా, మళ్లీ ఫిర్యాదు ఇవ్వాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 16న శాలిగౌరారం ఎస్సై వాస ప్రవీణ్కుమార్ ఆమెను స్టేషన్కు పిలిపించారు.
రెండు గంటలపాటు ఆయన చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశారు. ‘ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి.
భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్? అతనితో ఉండాలన్న కోరిక లేదా?’ అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు. తనకు అనేకమంది అమ్మాయిలు తెలుసునని, తనతో సఖ్యతగా ఉంటే పూర్తి సహకారం ఉంటుందని ఎస్సై చెప్పినట్లు ఎస్పీ ఎదుట బోరున విలపించారు.
అతను చెప్పినట్లు చేయకపోవడంతో తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవలు సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మహిళ ఫిర్యాదుపై ఎస్సై ప్రవీణ్కుమార్ను వివరణ కోరగా.. భూ పంచాయితీ విషయమై ఆమెను ప్రశ్నించానే తప్ప, వేధించలేదని చెప్పారు.