సమస్య ఏదొచ్చినా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి
భూముల అన్యాక్రాంతాన్ని సహించం
రైతు భరోసా, సాగు విత్తనాలపై పలు సూచనలు
గ్రామాల్లో అంతర్గత రోడ్లు, పాఠశాలల్లో సౌకర్యాలపై ఆరా
కొత్త గా ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణానికి స్థలాలు చూపాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయండి
వివిధ శాఖల అధికారులతో వేర్వేరు సమీక్షల్లో మంత్రి పొంగులేటి
ప్రజలకు ఇబ్బంది కలగనీయొద్దని ఆదేశాలు
సికె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి: తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మీ చెంతకొస్తారని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, జాప్యం జరగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. పలు సూచనలు చేయడంతో పాటు.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందుకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.
వివిధ శాఖల వారీగా మంత్రి పొంగులేటి సమీక్షల వివరాలు..
ఎంఆర్వోలతో..: పాలేరు నియోజకవర్గం లో ఎలాంటి భూమి అన్యాక్రాంతం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖకు సంబంధించి సమీక్షలో ఎం ఆర్ ఓ లను ఆదేశించారు. గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ధరణిలో పరిష్కారం కానివి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యుత్ శాఖ వారితో..: ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ఆరంభమైనందున సాగు లే న్లు, కనెక్షన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి అన్నారు. కామంచికల్, వెంకటగిరి ఏదులాపురం, నేలకొండపల్లి, కొరట్ల గూడెం సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కోరారు.
వ్యవసాయ శాఖ:రైతు భరోసా ను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి పొంగులేటి కోరారు. ప్రస్తుత సీజన్ కు సంబంధించి విత్తన కొరత లేకుండా చూడాలని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
కార్యాలయాలు తనిఖీ చేయండి..:తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాను తనిఖీ చేయాలని ఎంపీడీవోలకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సమస్యలు గుర్తించి.. కీలకమైనవి తన దృష్టికి తేవాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయించాలని ఆదేశించారు.
ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్..:
గ్రామాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, గుంతల సమస్య లేకుండా చూడాలని సూచించారు.
నీటిపారుదల శాఖ వారితో..: సాగు కాల్వలను పరిశీలించాలని, రైతులకు ఇబ్బంది రానీయవద్దని అన్నారు. అవసరమైన చోట చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు..
పాఠశాలలు సందర్శించండి..:
తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి.. లోటుపాట్లు గుర్తించాలని ఎంఈఓ లతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఉపాధ్యాయుల సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, అందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు.
అంగన్వాడీల సమస్య పరిశీలిస్తా..:60 ఏళ్లకు ఉద్యోగ విరమణ అంశం, రిటైర్డ్ అయ్యాక అంగన్వాడీ టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ. లక్ష చొప్పున అందజేయాలని పలువురు అంగన్వాడీలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. కచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలిస్తానని అభయమిచ్చారు.