'పంచాయతీ' పోరుకు కసరత్తు ముమ్మరం ఓటరు జాబితా తయారీకి ఆదేశాలు ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఒకరోజు శిక్షణ పూర్తి గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు సైతం ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణలో ప్రధానమైన వార్డుల విభజనపై ప్రభుత్వం మొదటగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు …

'పంచాయతీ' పోరుకు కసరత్తు ముమ్మరం

ఓటరు జాబితా తయారీకి ఆదేశాలు

ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఒకరోజు శిక్షణ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది.

స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చిన నేపథ్యంలో యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు సైతం ప్రారంభమైంది.

ఎన్నికల నిర్వహణలో ప్రధానమైన వార్డుల విభజనపై ప్రభుత్వం మొదటగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులు ఆదేశించారు.

ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లా ప్రాజెక్టు మేనేజరు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు హైదరాబాద్‌లో శిక్షణ కూడా పూర్తి అయింది. కాగా.. శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్లతో జిల్లాలోని ఎంపీడీవో, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం శిక్షణ ఇచ్చారు.

పార్లమెంట్‌ ఓటరు జాబితా ఆధారంగా..

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా వార్డుల విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితాను అందించాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది.

ఎన్నికల సంఘం నుంచి నియోజకవర్గం, మండలాలు, గ్రామాల వారీగా ఓటరు జాబితా రాగానే వార్డుల వారీగా విభజన చేయాలని నిర్ణయించింది. వార్డుల విభజనకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాల పై మాస్టర్‌ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.

ఒకే కుటుంబం అంతా ఒకే వార్డు పరిధిలో ఉండేలా విభజన చేయాలని ప్రధానంగా ప్రభుత్వం ఆదేశి ంచింది. గత ఎన్నికల సమయంలో ఒక కుటుంబంలో ఓటర్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడం, కొన్ని చోట్ల ఇతర గ్రామాల్లోనూ ఓటరుగా నమోదు అయి ఉండ డం లాంటివి ప్రభుత్వం గుర్తించింది.

ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన ఓటర్లను అంతా ఒక వార్డు పరిధిలోకే వచ్చేలా విభజన చేయనున్నారు. ఈ క్రమంలో రెండు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకొని జాబితా తయారు చేయాలని సూచించారు.

ఓటరు లిస్ట్‌లో కుటుంబ సభ్యులంతా ఒకే వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించిoది. ఇందు కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్‌వేర్‌ ద్వారా వార్డుల విభజన చేయనున్నారు. కాగా.. వార్డుల విభజనకు ప్రభుత్వం ఎలాంటి గడువు విధించలేదు.

మూడు విడతలుగా ఎన్నికలు..

గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పం చి ఎన్నికలను మూడు విడతలుగా ప్రభుత్వం నిర్వహించనుంది. ఒకే సారి ఎన్నికలు నిర్వహిం చేందుకు సిబ్బంది సరిపడకపోవడంతో మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు, 2564 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కేటాయింపుపై ఎన్నికల సంఘం గతంలోనే మార్గద ర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ఒక్కో వార్డుకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల ప్రాతిపదికన పోలింగ్‌ కేంద్రాలకు ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారులను కేటాయించనున్నారు.

200 ఓట్ల లోపు ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారి, 200-400 ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 650 పైన ఓట్లు ఉన్న కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 650 ఓట్లు పైన ఉన్న గ్రామాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబరులో సూచించింది.

ఫిబ్రవరి 1తో పదవీకాలం పూర్తి

2024 ఫిబ్రవరి 1తో సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పదవీకాలం పూర్తి అయ్యే లోపే ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2019 జనవరిలో నెలలో జనగామ జిల్లాలోని పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఐదేళ్ల తర్వాత సరిగ్గా అదే జనవరి లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

కానీ.. అసెంబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం కావడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో మరింత ఆలస్యం అయింది. కాగా.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల అవసరమయ్యే పోలింగ్‌ సిబ్బంది,

గత ఎన్నికల్లో ఓటర్లు, ప్రస్తుత ఓటర్లు, గత ఎన్నికల సందర్భంగా వార్డులకు, సర్పంచి పదవి ఉన్న రిజర్వేషన్‌ ఏంటన్న అంశాలపై ఎన్నికల సంఘం కలెక్టర్ల నుంచి గత ఏడాది డిసెంబరులోనే నివేదిక కోరింది. దీంతో జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులను శాఖల వారీగా, పే స్కేల్‌ వారీగా వర్గీకరణ చేసి 'తెలంగాణ-పోల్‌'(టీఈ-పోల్‌) వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశారు.

ఉద్యోగుల వివరాలతో పాటు 2009, 2014, 2019 పంచాయతీ ఎన్నికల్లో వార్డులు, గ్రామాల వారీగా కేటాయించిన రిజర్వేషన్‌ వివరాలను ఈనెల 30 లోగా 'పీపీఆర్‌ఎస్‌' మాడ్యూల్‌లో గత ఏడాది పొందుపరిచారు.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు ఇవ్వడంతో పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబరు మొదటి వారంలో షెడ్యూల్‌ వచ్చి సెప్టెంబరు మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

వార్డుల వారీగా జాబితా తయారు చేయాలి:

పార్లమెంట్‌ ఎన్నికల ఓటరు జాబితా ఆధారం గా గ్రామంలోని వార్డుల వారీగా ఓటరు జాబితా లు తయారు చేయాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు.

పంచాయతీ ఎన్నికల కసరత్తు లో భాగంగా కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు వార్డుల విభజనపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో నివేదిక తయా రు చేయాలని సూచించారు.

ఒక కుటుంబ మంతా ఒకే వార్డులో ఉండేలా జాబితాలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ సుహాసిని, డీఆర్‌డీవో వసంత, ఆర్డీవోలు కొమురయ్య, వెంకన్న, ఏవో రవీందర్‌, మాస్టర్‌ ట్రైనీలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Updated On 9 Aug 2024 11:03 AM IST
cknews1122

cknews1122

Next Story