HealthNationalPolitical

రతన్ టాటా కన్నుమూత...

రతన్ టాటా కన్నుమూత...

పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా కన్నుమూత

రతన్‌ టాటా 1937 – 2024

అనారోగ్యంతో ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస

టాటా గ్రూపును 10 వేల కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా

విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త.. దాతృత్వంలో మేటి

భారత ఆటోమొబైల్‌ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా

లేదన్న అపప్రథకు ‘ఇండికా’ కారు తయారీతో అడ్డుకట్ట

నష్టాల్లో ఉన్న బ్రిటన్‌ కంపెనీలు జాగ్వార్‌, లాండ్‌రోవర్‌లను కొని లాభాలబాటలోకి నడిపించిన నాయకుడు

స్వతంత్ర భారత పారిశ్రామిక రంగంలో ఒక శకం ముగిసింది.

విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది.

సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం తనువు చాలించింది.

సంపదను సృష్టిస్తూనే… ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది.

ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా ఇకలేరు.

ఎన్నటికీ చెరగని తన ఇంటి పేరును ఈ దేశానికి వదిలేసి… తాను మాత్రం వెళ్లిపోయారు!

ముంబై : భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్‌ ఎమెరిటస్‌ ఆఫ్‌ టాటా సన్స్‌.. రతన్‌ నావల్‌ టాటా (86) ఇక లేరు.

వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో.. ‘నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు’ అంటూ ప్రకటన చేసిన మూడురోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు ముని మనవడైన రతన్‌ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు.

తల్లిదండ్రులు సూని టాటా, నావల్‌ టాటా.. ఆయన పుట్టిన పదేళ్లకు విడిపోవడంతో, రతన్‌ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్‌బాయ్‌ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొంతకాలం చదివిన అనంతరం.. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివర్‌డేల్‌ కంట్రీ హైస్కూల్‌లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించారు.

1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్‌ టాటా.. 2008లో అదే కార్నెల్‌ యూనివర్సిటీకి 50 మిలియన్‌ డాలర్ల విరాళం ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం.. 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు.

తొలుత టాటా స్టీల్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీ డైరెక్టర్‌ ఇన్‌చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా.. ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేశారు. 1991లో జేఆర్‌డీ టాటా అనంతరం టాటా సన్స్‌ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి.. 2012 డిసెంబరు 28వ తేదీన రిటైరయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు.

ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్‌లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కానీ, ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు.. హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్‌ ఆయన హయాంలోనే 10 వేల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.

తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టాటా పవర్‌, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, టాటా కెమికల్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎ్‌సను.. దేశంలో వెయ్యికోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు..

తన ఆదాయంలో 60 నుంచి 65 శాతం మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌తో, 2008లో పద్మవిభూషణ్‌తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్‌ టాటా అందుకున్నారు.

బహుముఖ విస్తరణ

రతన్‌ టాటా హయాంలో టాటా గ్రూపు దేశ, విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నిటి కంటే ముఖ్యంగా ‘ఇండికా’ కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా, భారత ఆటోమొబైల్‌ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు.

నానో కారు ద్వారా రతన్‌ టాటా లక్ష రూపాయలకే మిడిల్‌ క్లాసుకు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్‌ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా, టాటా మోటార్స్‌ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చి దిద్దారు.

బ్రిటన్‌కు చెందిన టెట్లీ టీ బ్రాండ్‌ కొనుగోలు రతన్‌ టాటా హయాంలోనే జరిగింది. టాటా స్టీల్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరించడంతో పాటు, బ్రిటిష్‌ స్టీల్‌ కంపెనీని కొనుగోలు చేసి, టాటా స్టీల్‌ కంపెనీ కార్యకలాపాలను యూర్‌పకూ విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కారు, టెలికం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు.

సైరస్‌ మిస్త్రీతో వైరం

తన తర్వాత టాటా గ్రూప్‌ను సమర్థుడైన వారసునికి అప్పగించాలన్న ఆలోచనతో సైరస్‌ మిస్త్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. కాని వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీకి గుది బండలా మారిన ‘నానో’ కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ చేసిన ప్రయత్నాలకు రతన్‌ టాటా అడుగడుగునా అడ్డుతగిలారు.

తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రతన్‌ పట్టుబట్టడం వల్లే, మిస్త్రీ టాటా గ్రూప్‌కు దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్‌ చరిత్రలో మొదటిసారిగా పార్సీయేతర వ్యక్తి ఎన్‌ చంద్రశేఖరన్‌ టాటా గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం వెనక రతన్‌టాటా మద్దతు ఉంది.

50కి పైగా స్టార్ట్‌పల్లో పెట్టుబడులు

రతన్‌ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, స్నాప్‌డీల్‌, లెన్స్‌కార్ట్‌ సహా 50కి పైగా స్టార్ట్‌పల్లో ఆయన ఇన్వెస్ట్‌ చేశారు. అవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే!

ఎయిరిండియా కొనుగోలు

టాటా గ్రూప్‌ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తేవాలన్నది రతన్‌ టాటా చిరకాల వాంఛ. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, మలేషియా ఎయిర్‌లైన్స్‌తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు.

ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్‌ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు.

అయినా తమ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా ప్రారంభించిన ఎయిర్‌ ఇండియాను మళ్లీ తమ పట్టులోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్‌ ఇండియాను రతన్‌ టాటా కొనుగోలు చేశారు. ఇపుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది.

రతన్‌ టాటా విఫల ప్రేమగాథ!

వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటా కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే.. 1962లో భారత్‌, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్‌ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు.

ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్‌ వస్తుందని ఆశించారు. కానీ, భారత్‌- చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్‌ వెళ్లేందుకు అంగీకరించలేదు.

దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్‌ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్‌ దగ్గరయ్యారు.

వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్‌ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.

టాటా వారసులెవరు?

రతన్‌ టాటా మరణంతో ఈ సామ్రాజ్యం పగ్గాలు చేపట్టేందుకు అవకాశాలు, అర్హతలున్న టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయెల్‌ టాటా పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. రతన్‌ టాటా సవతి సోదరుడు నోయల్‌ టాటా. గ్రూప్‌ రిటైల్‌ వర్తక విభాగమైన ట్రెంట్‌తోపాటు పలు వ్యాపారాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నోయెల్‌ సంతానమైన మాయ, నెవిల్లే, లేహ్‌ టాటా సైతం పలు టాటా కంపెనీల్లో మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

మధ్య తరగతి కారు కల నానో

కారులో ప్రయాణించాలనే భారతీయ మధ్య తరగతి కుటుంబాల కల నెరవేర్చాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా సంకల్పించారు. ఆయన ఈ సంకల్పమే ‘నానో’ కారు రూపకల్పనకు దారితీసింది. ఈ కారును 2008లో మార్కెట్‌లోకి తెచ్చారు.

కేవలం రూ. 1,00,000 ధరే నిర్ణయించి ప్రపంచంలోనే చౌకైన కారుగా ప్రకటించారు. ఇలా అప్పటికి ధనిక వర్గాలకే పరిమితం అయిన కారును మధ్య తరగతి ప్రజలకూ అందుబాటులోకి తెచ్చి వారి కల నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభ కష్టాలు ఎదుర్కొన్నా… ఆటోమొబైల్‌ మార్కెట్లో సంచలనం సృష్టించింది.

ఆటోమొబైల్‌ పరిశ్రమ కేవలం ఉన్నత వర్గాల కోసమే కార్లను తయారుచేయడం కాకుండా మధ్య తరగతి, దిగువ వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని వాహనాలను తయారుచేయాలన్న చర్చకు దారితీసింది. ఈ విషయంలో రతన్‌ టాటా విజన్‌ స్పష్టంగా ఉంది… అదేమిటంటే మధ్య తరగతి స్థోమతకు తగ్గ కారును వారి ముందుంచడం… ‘నానో’తో ఆయన అది పూర్తిచేశారు.

రతన టాటా మరణంతో భారత్‌ ఓ గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. దాతృత్వం, సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం నిరుపమానం.

  • ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

రతన్‌ టాటా దార్శనిక వ్యాపారవేత్త. దయార్ధ హృదయుడు. మానవీయత మూర్తీభవించిన అసాధారణ మనిషి. సమాజాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం యత్నించారు.

  • నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

వ్యాపార రంగంలో రతన్‌ టాటా పాటించిన విలువ లు, సామాజిక సంక్షేమం కోసం ఆయన పడిన తప న స్ఫూర్తిదాయకం. సేవకు ఆయన ప్రతిరూపం.

  • రేవంత్‌ రెడ్డి, తెలంగాణ సీఎం

వ్యాపార దిగ్గజాన్నే కాదు గొప్ప మానవతావాదిని కూడా కోల్పోయాం. రతన్‌ టాటా దార్శనికత, సమైక్య భావనతో ఈ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు.

  • నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం

దిగ్గజ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది. దేశ అభివృద్ధి కోసం ఆయన నిస్వార్ధంగా అంకితమయ్యారు. మెరుగైన భారత్‌ కోసం ఆయన నిరంతరం తపనపడేవారు.

  • అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి

రతన్‌ దార్శనికత ఉన్న మనిషి. వ్యాపారంలోనూ, దాతృత్వంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.

  • రాహుల్‌ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత

ఆధునిక భారత్‌కు బాటలు పరిచిన దార్శనికుడు. రతన్‌ టాటా కేవలం వ్యాపారవేత్త కాదు. భారత సమగ్రతను నిలువెల్లా నింపుకున్న దిగ్గజం.

గౌతం అదానీ, పారిశ్రామికవేత్త

రతన్‌ టాటా మార్గదర్శకత్వం వెలకట్టలేనిది. మహనీయులకు మరణం లేదు.

ఆనంద్‌ మహీంద్రా, పారిశ్రామికవేత్త..

రతన్ టాటా విద్యాభ్యాసం ముంబైలోని కాంపియన్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలోని కార్నల్ యూనివర్సిటీకి వెళ్లారు అక్కడే ఆయన ఆర్కిటెక్చర్ విభాగంలో డిగ్రీ పొందారు.

నిజానికి రతన్ టాటా ఎంట్రీ టాటా గ్రూపులో రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసినట్లు జరగలేదు. ఎందుకంటే రతన్ టాటా, టాటా కుటుంబానికి చెిందినవాడే కానీ ఆ కుటుంబంలో అప్పటికే చాలామంది వారసులు ఉన్నారు.

రతన్ టాటా తండ్రి నావల్, టాటాల కుటుంబంలోకి ఒక దత్త పుత్రుడు మాత్రమే. అందుకే రతన్ టాటాకు టాటా కంపెనీలో ప్రవేశం ఒక సాధారణ ఉద్యోగి రూపంలోనే జరిగింది. రతన్ టాటా 1962లో టాటా గ్రూప్‌లో టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు.

టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీ, టెల్కో (ఇప్పుడు టాటా మోటార్స్ అని పిలుస్తున్నారు) జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో ఆరు నెలల శిక్షణను పొందారు. తర్వాత 1963లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో (ఇప్పుడు టాటా స్టీల్ అని పిలుస్తున్నారు) దాని జంషెడ్‌పూర్ ఫెసిలిటీలో అసిస్టెంట్ గా పనిచేశారు.

1970లో టాటా కంప్యూటర్ సిస్టమ్స్‌గా ప్రారంభించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో రతన్ టాటా ప్రవేశించారు. ప్రపంచంలో కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగం ఇంకా మొగ్గ దశలోనే ఉన్న సమయంలో రతన్ టాటా టీసీఎస్ లో పనిచేశారు.

ఇక 1971లో టాటా గ్రూపులో్ కష్టాల్లో ఉన్న నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ (నెల్కో) డైరెక్టర్-ఇన్‌చార్జ్ గా బాధ్యతలు చేపట్టి దాన్ని గాడిలో పెట్టారు. ఇక 1974లో టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు. మధ్యలో 1975వ సంవత్సరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు.

1981లో టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల తరువాత, టాటా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

1986-1989 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశారు 1991లో ఎట్టకేలకు టాటా సన్స్, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా JRD టాటా నుండి రతన్ టాటా పగ్గాలు స్వీకరించారు.

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

2000: బ్రిటీష్ టీ బ్రాండ్ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా చేశారు.

2004: TCS ఐపీవో ద్వారా చరిత్ర సృష్టించారు.

2005: టాటా కెమికల్స్ బ్రిటిష్ కంపెనీ బ్రన్నర్ మోండ్‌ని కొనుగోలు చేసింది

2007: యూరోపియన్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేసింది

2008: జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేసింది

2008: భారతదేశంలో అత్యంత సరసమైన కారు టాటా నానోను విడుదల చేసింది

2008: దేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ లభించింది

2012: టాటా గ్రూప్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం తర్వాత రతన్ టాటా, టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు, సైరస్ మిస్త్రీకి బాధ్యతలు అందించారు. టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు

2016: సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు;

అక్టోబరు 2016-ఫిబ్రవరి 2017: టాటా గ్రూప్‌కు తాత్కాలిక చైర్మన్‌గా పని చేశారు.

2018: టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా చైర్మన్ బాధ్యతల స్వీకరణ

2017 నుండి: 30కు పైగదా స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు.

భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సన్మానించింది. ఆయన తన దానధర్మాలకు కూడా ప్రసిద్ధి చెందారు తన ఆస్తిలో సుమారు 60 శాతం దానధర్మాలకే కేటాయించేవారు. రతన్ టాటా చరిత్ర గురించి చెప్పాలంటే ఒక వ్యాసం సరిపోదు ఒక మహా గ్రంథం అయినా సరిపోదు.

ఈ దేశంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక రతన్ టాటా నీడలా నిలబడ్డారు. దేశ సరిహద్దుల్లో జవాన్ నుంచి పొలాల్లో రైతుల వరకు టాటా తన వ్యాపారం ద్వారా సేవలను అందించింది.

ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి సొంత కారులో కుటుంబంతో సహా వెళ్లాలని కలలుకని ఎంతో ఇష్టంగా డిజైన్ చేసి విడుదల చేసిన టాటా నానో కారు. రతన్ టాటా అభిరుచికి నిదర్శనం.

దేశంలోని సామాన్యులకు సైతం టాటా తన ఉత్పత్తుల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా చేరువైంది. నేడు భారతదేశంలో ఐటీ రంగ విప్లవం వెనుక రతన్ టాటా కృషి అనితర సాధ్యమైనదని చెప్పవచ్చు.

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ సర్వీసుల సంస్థగా టిసిఎస్ ఎదిగింది. సుమారు పది లక్షల మంది ఉద్యోగులు టాటా గ్రూపు సంస్థల ద్వారా నేడు ఉపాధిని పొందుతున్నారు. అంతకు పదిరెట్లు మంది పరోక్షంగా టాటా సంస్థల నుంచి ఉపాధిని పొందుతున్నారు…రతన్ టాటాను ఆధునిక భారత జాతి నిర్మాతగా కీర్తించినా తక్కువే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!