
కూతురు పుట్టిన ఇళ్లు కళకళలాడుతూ ఉంటుంది జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తేనే అడపిల్లలకు సమానత్వం
పురుషులతో పోటీపడుతూ ప్రతి రంగంలో మహిళలు ముందంజలో నిలుస్తున్నారు.
నగరంలోని ద్వారకనగర్ లో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
సికె న్యూస్ ప్రతినిధి
సామాజికంగా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తేనే అడపిల్లలకు సమానత్వం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
ఆడపిల్లలు పుట్టడం అదృష్టమని తెలుపుతూ, ప్రతి బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మా పాప – మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 51వ డివిజన్ ద్వారకనగర్ లో బేగం కుటుంబ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు అందంగా ఇంటిని ఆలంకరించి ఆడపిల్లలను పుట్టనిద్దాం.. ఆడపిల్లలను పెరగనిద్దాం.. అమ్మాయిలు ఐపీఎస్, ఐఎఎస్, పోలీస్, డాక్టర్, టీచర్, లాయర్, సైంటిస్ట్, పైలెట్ పలు రంగాల్లో ఉన్నతంగా రాణించాలనే నినాదాలతో ముగ్గులు వేసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కు ఘన స్వాగతం పలికారు. షాజీదాబేగం- అఖీల్ దంపతులకు 12 ఫిబ్రవరి, 2025న ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసి, వారి ఇంటికి వచ్చిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాప తల్లిదండ్రులతో పాటు నాన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ బంధువులను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, నూతన దుస్తులు, సర్టిఫికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సన్మానించారు. చేతులతో పాపను ఎత్తుకొని రంగు రంగుల పూలతో ముస్తాబు చేసిన ఊయలలో వేసి పాప చిరునవ్వుకు కలెక్టర్ మురిసిపోయారు. సమాజానికి ఆడపిల్లల ఆవశ్యకత ఏలాంటిదో వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఆధికారులు ఈ కార్యక్రమంలో ఆడబిడ్డలను ఆశీర్వదించడం చూస్తుంటే సంతృప్తి కలుగుతుందని ఆనందం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, సమాజంలో మహిళలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ముందుంటున్నారని, ఆడపిల్లలను బాధ్యతగా పెంచి పోషించి బంగారు భవిష్యత్ను కల్పించాలని కోరారు. ఆడబిడ్డ పుట్టిన తల్లిదండ్రులు అదృష్టవంతులు అని అన్నారు. అమ్మాయిలను మగవారితో పమానంగా విద్య, వైద్యం, న్యాయం, సంరక్షణ, సామాజిక ఎదుగుదలకు అవకాశాలు కల్పించాలని సూచించారు. ఆడపిల్లలే ఇంటికి మణి దీపాలు ప్రస్తుత ఆధునిక యుగంలో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీపడుతూ దూసుకెళ్తున్న మహిళలు ఏ రంగంలో తక్కువ కాదు అని నిరూపిస్తున్నారని అన్నారు. కుటుంబ వ్యవస్ధలో, సమాజం అత్యాధునిక అభివద్ది పదంలో కొనసాగటానికి ప్రధాన భూమిక మహిళలదే అని, మహిళలను బాల్యం నుండే ప్రోత్సహించి దేశ అభ్యున్నతికి అందరూ కషి చేయాలని తెలియజేశారు.
అమ్మాయిలు గొప్ప స్ధానంలో ఎదిగేందుకు ఎవరికి తక్కువ కాకుండా పెంచాలని, మనం ఆశించే మార్పు మన ఇంటి నుండే ప్రారంభించాలని, ఆడబిడ్డ కుటుంబానికి అమ్మగా ఉంటుందని, అన్ని బంధాలకు మాతృప్రేమ పంచేవారని అన్నారు. సమాజంలో అమ్మాయి పుడితే మనకు అమ్మ పుట్టినట్లు భావించాలని కలెక్టర్ సూచించారు.
మహిళా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి, మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు.
ఆనతరం పాప తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా ఇంటికి కలెక్టర్ వచ్చి మా పాపకు ఆశీస్సులు అందించి, పాప భవిష్యత్తు గురించి చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని, కలెక్టర్ చెప్పిన విధంగా మా పాపను మంచిగా చదివించి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిదుతామని, పాప పెద్దయిన తర్వాత ఇంటికి కలెక్టర్ గారే స్వయంగా వచ్చి దీవించి వెళ్లారని తెలిపి ఈ నాటి మధుర క్షణాలను పంచుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిడిపివో బి. వీరభద్రమ్మ, సూపర్వైజర్ విజయలక్ష్మి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.