
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలి….. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క
జూన్ 3 నుంచి జూన్ 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా
వానాకాలం ముందస్తు సాగుకు రైతులను సన్నద్దం చేయాలి
వానాకాలం పంట సాగుకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు
నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ శాఖ ముందస్తు సాగుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ లు, జిల్లా అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం, మంత్రులు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం, మే-29:
ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ శాఖ ముందస్తు సాగు వంటి పలు అంశాలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించారు.
సమీక్ష లో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు పెట్టే లక్షల రూపాయల పెట్టుబడి, వారి కష్టం వృధా అవుతుందని అన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవసరమైన సహకారం తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే వారికి పుట్టగతులు లేకుండా చేయాలని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు కూడా పూర్తి చేశామని అన్నారు. 5 లక్షల రూపాయలతో పేదలకు ఇండ్లు కట్టించే పథకం దేశంలో ఎక్కడా లేదని, ఒకేసారి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. 22 వేల 500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని అన్నారు.
మనిషికి భూమికు ఉన్న అనుబంధం గత ప్రభుత్వం ధరణి పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. భూ భారతి చట్టంతో ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజలకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పిస్తూ మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే వివిధ పథకాలు వివరించాలని అన్నారు. ఉదయం జాతీయ పతాకావిష్కరణతో పాటు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో వేడుకలు నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
త్రాగునీటి సరఫరా ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఆసుపత్రి నిర్వహణ పకడ్బందీ ఉండాలని, అవసరమైన మందుల స్టాక్ పంపుతున్నామని, ప్రతి నెలా ఆరోగ్య శ్రీ, డ్రగ్స్ చెల్లింపులు పూర్తి చేస్తున్నామని అన్నారు.
సమీక్ష లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖల మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాల పై తీసుకుంటున్న చర్యలు వెంటనే పత్రికలు, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ర్యాండమ్ గా చెక్ చేయాలని, అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు చేరాలని మంత్రి సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్స్ మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనులు పురోగతిని కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు బాగా జరుగుతున్నాయని, ఈ సంఖ్య మరింత పెరగాలని అన్నారు.
రుతుపవనాలు ముందుగా వచ్చిన నేపథ్యంలో వానాకాలం పంట సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందు బాటులో పెట్టాలని అన్నారు. రాష్ట్రంలోని పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ బాగు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని అన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం పనులు 200 కోట్లతో ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
సమీక్ష లో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఎరువుల, విత్తనాల కొరత రాకుండా జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుందని అన్నారు. స్టాక్ వివరాలను రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ ప్రతి మండలంలో అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉండాలని అన్నారు.
సమీక్ష లో రెవెన్యూ , హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, అసైన్మెంట్ భూములలో పోజిషన్ లో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఉందని, వీటికి సంబంధించి ప్రతిపాదనలు ఉంటే సమర్పించాలని అన్నారు. సాదా బైనామా సంబంధించి ప్రభుత్వ భూములకు కూడా కొంతమంది దరఖాస్తులు చేసుకున్నారని, వీటిని తక్షణమే తిరస్కరించాలని మంత్రి ఆదేశించారు.
హై కోర్టు నుంచి స్టే తొలగిన వెంటనే అర్హత ఉన్న సాదా బైనామాలను పరిష్కరిస్తామని అన్నారు. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాలలో తహసిల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని మంత్రి ఆదేశించారు.
దేశంలో ఎక్కడా పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదని, లబ్దిదారులను పూర్తి పారదర్శకంగా, నిరు పేదలను ఎంపిక చేయాలని అన్నారు. ఒత్తిడులకు లోనై అనర్హులకు ఎక్కడైనా ఇండ్లు మంజూరు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పెట్టుబడి సొమ్ము లేకపోతే మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయాలని మంత్రి తెలిపారు. జూన్ 10 లోపు పైలెట్ ప్రాజెక్టు క్రింద మంజూరు చేసిన ఇండ్లు గ్రౌండింగ్ పూర్తి కావాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు కోసం అవసరమైన ఇసుక లబ్దిదారులకు టోకెన్ ద్వారా ఉచితంగా అందించాలని, ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఇంటి నిర్మాణం పరికరాల ధరల నియంత్రణ కు కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని అన్నారు. సగం దశలో మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
నీటి పారుదల శాఖ పరిధిలో పెండింగ్ ఆపరేషన్ అండ్ మేయింటెనెన్స్ పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చేయాలని మంత్రి సూచించారు. పేదల సంతోషం కోసం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
ఎంపి రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ తడిచిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఉన్న సందేహాలను మంజూరు పత్రాల పంపిణీ సమయంలో నివృత్తి చేయాలని అన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ లో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేశామని, లక్షా 21 వేల మెట్రిక్ సన్న రకం ధాన్యం, 95 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి బోనస్ తో సహా చెల్లింపులు పూర్తి చేశామని అన్నారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా రైస్ మిల్లులకు అలాట్మెంట్ చేశామని అన్నారు.
సన్న రకం ధాన్యంకు బోనస్ ప్రకటించడంతో ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందని, రాబోయే వానాకాలం పంట దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా సాగు జరుగుతోందని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నా మని కలెక్టర్ తెలిపారు.
ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయం జరగకుండా జాగ్రత్త వహిస్తున్నామని అన్నారు. గ్రామంలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు విక్రయాలు జరిగితే వెంటనే సమాచారం తెలిసేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఎరువుల లభ్యతపై రెగ్యులర్ గా సమీక్ష చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా చూస్తామని అన్నారు.
నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు క్రింద రెవెన్యూ సదస్సులు నిర్వహించామని అన్నారు. భూ సమస్యలపై నేలకొండపల్లి మండలంలో ప్రజల నుంచి 3224 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 1791 సాధా బైనామా దరఖాస్తులు ఉన్నాయని, ఫీల్డ్ సర్వే చేసి డాక్యుమెంట్ ఉన్న అర్హులకు సమస్య పరిష్కరించి పట్టాలను పంపిణీ చేస్తామని అన్నారు.
మిగిలిన 1433 పైగా దరఖాస్తులో ఎక్కువ శాతం సర్వే నెంబర్ విస్తీర్ణం, సర్వే నెంబర్ పాస్ బుక్ లో ఎక్కలేదని దరఖాస్తులు వచ్చాయని, క్షేత్ర స్థాయి ఎంజాయ్ మెంట్ సర్వే చేసి 299 దరఖాస్తులు ఆమోదించామని, ప్రతి తిరస్కరించిన దరఖాస్తుకు కారణం స్పష్టంగా తెలియ జేస్తున్నామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు మంజూరు చేసిన 800 పైగా ఇండ్లలో 30 ఇండ్లు చివరి దశకు చేరుకున్నాయని అన్నారు. 200 పైగా లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టామని అన్నారు.
రాబోయే వానాకాలం లోతట్టు ప్రాంతాలలో నీటి నిల్వ ఉండకుండా పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు.
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నకిలీ విత్తనాలపై పటిష్టమైన విజిలెన్స్ ఏర్పాటు చేశామని అన్నారు. కోర్టు స్టే తొలగిన వెంటనే సుజాత నగర్ పైలెట్ మండలంలో సాధా బైనామా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని అన్నారు. ఇంటి నిర్మాణ సామాగ్రి తక్కువ ధరకు పేదలకు అందించాలని అన్నారు. జిల్లాలో కొన్ని చోట్ల రైస్ మిల్లుల వద్ద తరుగు పేరుతో ధాన్యం కోత విధిస్తున్నారని , దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగూడెం ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని అన్నారు.
వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగిందని, యాసంగి సీజన్ లో కొంత ఇబ్బంది జరిగిందని, వచ్చే సీజన్ లో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే డా మట్టా రాగమయి దాయనంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో గృహలక్ష్మి క్రింద బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించి డబ్బులు రాకుండా నిలుపుదల అయిన వాటికి ఇల్లు పూర్తి చేసే విధంగా డబ్బులు మంజూరు చేయాలని, సత్తుపల్లి నియోజకవర్గ ప్రాంతంలో వైద్యుల కొరత ఉన్నదని, 100 పడకల ఆసుపత్రికి అనుగుణంగా వైద్యులను కేటాయించాలని కోరారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ లు పి. శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, డిఆర్వో ఏ. పద్మశ్రీ, ఉమ్మడి జిల్లాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.