
సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం.!
ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాలకు దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ బర్త్డే పార్టీ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా..
ఈ దాడుల్లో భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్గా తేలడం కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రిసార్టుపై దాడులు చేశారు.
అయితే ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొన్ని సాంపుల్స్కు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. డ్రగ్స్ వినియోగించిన వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో సినీ వర్గాల్లో, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల వాడకంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వాహకుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.