
పెళ్లైన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ గ్రామంలోని ఓ వివాహిత పెళ్లైన మూడు నెలలకే తన అత్తగారి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాత ఎల్లపూర్ గ్రామానికి చెందిన దండుగుల నర్సవ్వ, పోషన్న దంపతుల కూతురు శైలజ (20) ను అదే గ్రామానికి చెందిన అల్లెపు రాజేష్ కు ఇచ్చి వివాహం జరిపించారు.
పెళ్లి అయిన రెండో నెల నుంచి శైలజను తన భర్త రాజేష్, అత్త లక్ష్మి రోజు వరకట్నం తేవాలని, లేకుంటే మీ ఇంటికి పొమ్మని వేధిస్తున్నారని తన తల్లిదండ్రులకు వివరించిందని బంధువులు తెలిపారు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే ఖానాపూర్ పట్టణానికి నిర్మల్ జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా, ఇంచార్జి సీఐ గోవర్ధన్, తహసీల్దార్ సుజాత చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్ తెలిపారు.