
ఇందిరమ్మ లబ్దిదారులకు మరో శుభవార్త.. అదనంగా లక్ష రూపాయల లోన్ !
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇందిరమ్మ ఇళ్లు.
ఇప్పటికే దశల వారీగా నిధులు సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుడికి 8 ట్రాక్టర్ల ఉచిత ఇసుక అందించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో విడుదల చేశారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల రూపాయలు సహాయం చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇళ్ల నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తోందని చెప్పుకొచ్చారు.
400-600 చదరపు అడుగుల్లోపే ఇందిరమ్మ ఇల్లు
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని 400- 600 చదరపు అడుగులు లోపే ఇల్లు నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోతే మహిళా సంఘాల నుంచి లబ్ధిదారులకు లక్ష రూపాయల రుణం అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని… ఎలాంటి ఆటంకాలు లేకుండా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుకు రూ.22.64 కోట్లు విడుదల
తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం… తాజాగా లబ్దిదారులకు రూ. 22.64 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రూ. రూ.98.64 కోట్లు విడుదల చేసినట్టుగా తెలిపింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఈనెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ వారానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.22.64 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో 1,549 ఇళ్లు బేస్మెంట్, 481 ఇళ్లు గోడల వరకు, మరో 117 ఇళ్లు శ్లాబ్ వరకు పూర్తయ్యాయని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,877 ఇళ్లు బేస్మెంట్ వరకు, 1,839 ఇళ్లు గోడల వరకు, 388 ఇళ్లు శ్లాబ్ వరకు పూర్తయ్యాయని చెప్పారు. వాటికి మొత్తం రూ.98.64 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని చెప్పారు. లబ్దిదారులపైనే నిర్మాణ బాధ్యత ఉంటుందని అన్నారు. లబ్ధిదారులు వారి స్థలానికి అనుగుణంగా… 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఇంటి నిర్మాణం చేపట్టుకోవాలని చెప్పారు.
నగదు జమ గురించి తెలుసుకోండిలా!
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. https://indirammaindlu.telangana.gov.in/ వెబ్సైట్ ద్వారా తమకు ఇళ్లు మంజూరు అయిందా? లేదా? అనేది తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
అలాగే నిధుల విడుదలకు సంబంధించి లబ్దిదారులు… తమ బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే.