
మానసిక ప్రశాంతతకు.. దివ్య ఔషధం యోగా
- ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి
- లకారం ట్యాంక్ బండ్ వద్ద యోగా దినోత్సవానికి హాజరు
- స్వయంగా యోగాసనాలు వేసి.. ఉత్సాహపరిచిన ఎంపీ
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: మానసిక ప్రశాంతతకు, శారీరక ఉల్లాసానికి, మంచి ఆరోగ్యానికి యోగా.. దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శనివారం ఉదయం 6:30 గంటలకు ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. స్వయంగా యోగా ఆసనాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. యోగా అనేది ఆరోగ్యానికి ఒక క్రమశిక్షణాయుతమైన దినచర్య అని అన్నారు. మన దేశంలో ఆరంభమై..ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని తెలిపారు. మహిళలు సైతం ప్రత్యేక శ్రద్ధతో యోగా తరగతులు నిర్వహిస్తుండడాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో యోగా క్లాసుల నిర్వాహకులు శ్రీలత, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మహిళా నాయకురాలు చల్లా ప్రతిభారెడ్డి, కార్పొరేటర్లు, టీఏసీ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.