
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
గంజాయి తనిఖీలలో విషాదం…
గంజాయి తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందడంతో విషాదం నెలకొంది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ ప్రవీణ్ కొందరు పోలీసులతో కలిసి తనిఖీలకు వెళ్లాడు.
ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రవీణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది చింతల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్(39) మృతిచెందాడని నిర్ధారించారు.
గుండెపోటు రావడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. అనంతరం కానిస్టేబుల్ ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోవడంతో బాలానగర్ జోన్ ఎస్ఓటి బృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.