
నవ వధువు ఆత్మహత్య…
ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఆమెకు అనుమానం పెనుభూతమైంది. భర్త వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది.
కేపీహెచ్బీ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం…ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సాలె బంజరకు చెందిన మాలోతు శ్రీనివాస్, నాగమణి దంపతులకు ఒకగానొక్క కూతురు పూజిత.
ఒక్కతే కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. ఈ క్రమంలో కూతురు తమ కళ్లముందే ఉంటుందన్న ఉద్దేశంతో అదే గ్రామానికే చెందిన జాటోతు శ్రీనివాస్ అనే యువకుడికి ఇచ్చి ఏప్రిల్ 16న ఘనంగా పెండ్లి చేశారు.
శ్రీనివాస్ హైదరాబాద్ కేపీహెచ్బీ సర్వీస్ రోడ్డులో ఉన్న ఒక నగల దుకాణంలో సేల్స్మాన్గా పనిచేస్తున్నాడు. పెండ్లి తర్వాత అక్కడికి సమీపంలోని టెంపుల్ బస్టాప్ దగ్గర కాపురం పెట్టారు.
ఇదిలా ఉండగా పూజిత పెండ్లికి ముందు కొద్దికాలం క్రితం తమ గ్రామంలో ఉన్న సమయంలో తన బంధువులతో కలిసి కూల్డ్రింక్ తాగింది. దీన్ని శ్రీనివాస్, అల్లుడు వీడియో తీశారు. దీన్ని వారు వాట్సప్లో ఆమెకు పంపారు.
అయితే వారికి శ్రీనివాస్కు మధ్య విబేధాలు ఉండటంతో వారితో అలా క్లోజ్గా ఉండటం నచ్చని శ్రీనివాస్ తమకు పడని వాళ్లతో కూల్డ్రింక్ తాగడమేంటని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
పూజిత ఎంత నచ్చజెప్పిన శ్రీనివాస్ తీరు మారలేదు. దీనితో మనస్తాపానికి గురైన పూజిత శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనివాస్ నగల దుకాణం నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది.
వెంటనే ఆమెను దించి కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన వెంటనే పూజిత కుటుంబసభ్యులు హుటాహుటిన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఒక్కగానొక్క కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
చిన్నప్పటి నుంచి పెంచి వివాహం చేసిన పూజిత నానమ్మ గుండెలవిసేలా రోదించిన తీరు అందరిని కలిచివేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్, అతడి కుటుంబసభ్యులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.