
ప్రేమ వ్యవహారంలో మందలించడంతో తల్లిని హత్య చేసిన కూతురు, జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఘటన
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ విషయం తెలిసి, మందలించడంతో ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది ఆ కుమార్తె.
NLB నగర్ లో అర్థరాత్రి హత్య జరిగింది.
ఆ వివరాలిలా ఉన్నాయి..
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని NLB నగర్ లో సట్ల అంజలి(39), తన కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక(16) టెన్త్ క్లాస్ చదువుతోంది. పగిల్ల శివ(19)తో బాలికకు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తరచుగా అతడితో మాట్లాడుతున్న గుర్తించిన తల్లి అంజలి కూతుర్ని మందలించింది. అతడ్ని కలవొద్దు అని, ప్రేమ వ్యవహారం లాంటి వాటి జోలికి వెళ్లొద్దని బాగా చదువుకోవాలని కుమార్తెకు సూచించింది. దాంతో ఇక ప్రియుడ్ని కలుస్తానో లేదో, అతడు దూరం అవుతాడని భావించి కన్నతల్లి హత్యకు ప్లాన్ చేసింది.
పేగు బంధాన్ని మరిచిన కూతురు తన ప్రియుడు పగిల్ల శివ, అతడి సోదరుడు పగిల్ల యశ్వంత్(18) తో కలి తల్లిని హత్య చేయాలని డిసైడ్ అయింది. సోమవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి గొంతు నులిమి, ఆపై తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాలికను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు చెబుతుందన్న కారణంగానే తల్లి హత్యకు ప్లాన్ చేసి చంపేసిందని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.