
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. దీంతో ఈ నామిషన్ల ప్రక్రియకు షురూ అయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
అనంతరం వాటిని పరిశీలిస్తారు.
అయితే నామినేషన్లు ఉపసంహరించుకునే గడువును సైతం ఈ రేపు సాయంత్రం వరకు గడువు విధించారు. ఈ అధ్యక్ష ఎన్నిక మంగళవారం జరగనుంది.
ఈ ఎన్నికల పరిశీలకురాలిగా కర్ణాటకకు చెందిన శోభ కరంద్లాజే వ్యవహరించనున్నారు. ఒకటి కంటే ఎక్కువ నామిషన్లు దాఖలైతే.. ఎన్నిక నిర్వహించే అవకాశముందని తెలుస్తుంది.
మరో వైపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పలువురు పేర్లు.. రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఎంపికయ్యే అవకాశముందని సమాచారం.
అయితే ఈ సారీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీసీని ఎంపిక చేయాలనే తలంపులో పార్టీ అగ్రనాయకత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.మరో వైపు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండేవారు.
కానీ పలు కారణాల వల్ల 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేసి.. ఆయనకు బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో నాటి నుంచి ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇంకోవైపు ఆయన కేంద్ర మంత్రిగా సైతం పని చేస్తున్నారు. అయితే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆ క్రమంలో వారికే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనే తలంపుతో పార్టీ అగ్రనాయకత్వం ఉంది.