
తెలంగాణ టీటీసీ రాత పరీక్ష తేదీ విడుదల.. ఇంతకీ ఎప్పుడంటే?
ఈ ఏడాది వేసవి సెలవుల్లో 42 రోజులపాటు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ కోర్సు చేసిన వారికి రాత పరీక్ష తేదీని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ప్రకటించారు.
తాజా ప్రకటన మేరకు టీటీసీ పరీక్షను ఆగస్టు 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
యూజీసీ-నెట్ జూన్ 2025 ప్రాథమిక కీ విడుదల.. జులై 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2025 (యూజీసీ- నెట్) పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
సబ్జెక్టుల వారీగా ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీనిపై జులై 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలను తెలుపవచ్చని ఎన్టీయే తెలిపింది.
అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీ రూపొందించి, ఫలితాలు వెల్లడించనుంది. కాగా జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇందులో ప్రతిభ కనబరచిన వారికి జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. ఈ పరీక్షను మొత్తం 85 సబ్జెక్టులకు ఏటా రెండు సార్లు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
యూజీసీ-నెట్ జూన్ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. జులై 14 నుంచి ఏపీ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్ ఐటీ తరగతులు జులై 14 నుంచి ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జులై 5తో అడ్మిషన్ల పక్రియ ముగిసిందన్నారు. మిగిలిన ఖాళీలకు రెండో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.