
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్లకు శుభవార్త.. హాస్పిటల్లో 2 గంటలే ఉన్నా కవరేజ్
న్యూఢిల్లీ : గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు కనీసం 24 గంటలైనా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం రెండు గంటల హాస్పిటలైజేషన్ అవసరమైన ట్రీట్మెంట్లను కూడా కవర్ చేస్తున్నాయి.
మెడికల్ టెక్నాలజీ, ట్రీట్మెంట్ విధానాలు అడ్వాన్స్ అవ్వడంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో కూడా మార్పులు వస్తున్నాయి. ‘గత పదేళ్లలో హెల్త్కేర్ సెక్టార్ బాగా డెవలప్ అయ్యింది. ట్రీట్మెంట్లు, సర్జరీలు జరిగే విధానం పూర్తిగా మారిపోయింది.
దీనివల్ల రోగులు హాస్పిటల్లో గడపాల్సిన సమయం బాగా తగ్గింది’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ వివరించారు. గతంలో కంటిశుక్లం తొలగింపు, కీమోథెరపీ, యాంజియోగ్రఫీ వంటి సర్జరీలు లేదా ప్రొసీజర్లకు రాత్రిపూట హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది.
ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్, మెరుగైన డయాగ్నోస్టిక్స్ వల్ల ఇవి కొన్ని గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఈ మార్పును గుర్తించి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీల్లో షార్ట్-టర్మ్ హాస్పిటలైజేషన్ కవరేజ్ను చేర్చాయి.
దీనివల్ల పాలసీదారులు 24 గంటల పాటు హాస్పిటల్లో ఉండకపోయినా వారి క్లెయిమ్లు రిజెక్ట్ కావు. ఈ షార్ట్-టర్మ్ హాస్పిటల్ స్టే కవరేజ్కు ప్రత్యేకంగా ఎటువంటి అదనపు మినహాయింపులు ఉండవు.
ఇటువంటి ఫీచర్లను అందించే కొన్ని ప్లాన్లలో ఐసీఐసీఐ లొంబార్డ్ ఎలివేట్ ప్లాన్, కేర్ సుప్రీం ప్లాన్, నివా బూపా హెల్త్ రీఅష్యూర్ ప్లాన్ ఉన్నాయి.
30 ఏళ్ల వయసున్న, పొగతాగని, మెట్రో సిటీల్లో నివసించే పురుషుడికి రూ.10 లక్షల సమ్ ఇన్సూర్డ్ కోసం ఐసీఐసీఐ లొంబార్డ్ ఎలివేట్ పాలసీ కింద ఏడాదికి కనీసం రూ.9,195 ప్రీమియం కట్టాలి. కేర్ సుప్రీం పాలసీ కింద రూ.12,790, నివా బూపా హెల్త్ రీఅష్యూర్ కింద రూ.14,199 ప్రీమియం చెల్లించాలి.