
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నేడు సుప్రీం తీర్పు
దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించనుంది.
ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది.
పార్టీలు మారిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్కి కోర్టులు సూచనలు చేసే అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వు చేసింది.
ఆ రిజర్వు చేసిన తీర్పును రేపు.. అంటే గురువారం సుప్రీం ధర్మాసనం వెలువరించనుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ పది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు స్పీకర్ను కోరినా.. స్పందన లేదు.
ఈ నేపథ్యంలో వారిపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ తరహా అంశంలో స్పీకర్కు పలు సూచనలు చేసే అంశంపై ఇప్పటికే కోర్టులో పలు వాదనలు జరిగాయి. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసి ఉంచింది.