
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన హరికృష్ణ (21) అనే యువకుడు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కు చెందిన ఓ మైనర్ బాలికకు ఇంస్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు. ఈ విషయాన్ని బాలానగర్ సీఐ, టి. నర్సింహరాజు మీడియాకు వెల్లడించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం, జోగులాంబ గద్వాల జిల్లా వాసి హరికృష్ణ (21) డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నాడు.
ఐదు నెలల క్రితం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల మైనర్ బాలికతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. మొదట సాదాసీదా చాటింగ్తో మొదలైన ఈ పరిచయం, కొద్దికాలంలో సన్నిహితంగా మారింది.
ఈ క్రమంలో జూన్ నెలలో హరికృష్ణ (Harikrishna), బాలికను ఐడీపీఎల్ టౌన్షిప్ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అమాయకంగా అతని మాట నమ్మి అక్కడకు వెళ్లిన బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వైద్యులు పరీక్షలు జరిపి ఆమె గర్భవతి అని తేల్చారు
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఆ తరువాత కూడా పలు సందర్భాలలో బాలికను వివిధ ప్రదేశాలకు పిలిచి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల బాలిక ఆరోగ్యం బాగోలేక వాంతులు చేయడం, అలసటతో ఉండడం గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి ఆమె గర్భవతి అని తేల్చారు. షాక్కు గురైన తల్లిదండ్రులు కారణం అడగగా,కన్నీటి పర్యంతమై బాలిక, హరికృష్ణ తనపై లైంగిక దాడి చేసిన విషయాన్ని వివరించింది.తక్షణమే తల్లిదండ్రులు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు హరికృష్ణపై పాస్కో చట్టం, అత్యాచారం కేసులు నమోదు చేసి శోధన ప్రారంభించారు. చివరికి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.