
స్థానిక సంస్థల ఎన్నికలు.. కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశంజరుగుతున్న వేళ స్థానిక సంస్థల వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా వివరాలన్నింటినీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్సృజన శనివారం ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పేర్లు, వాటి సంఖ్యను మరోసారి చెక్ చేసి వాటి వివరాలను వెంటనే రాష్ట్ర పంచాయతీరాజ్కమిషనర్కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.
కొన్ని జిల్లాల్లో మార్పులు
కొన్ని జిల్లాల్లో అనేక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. మరికొన్ని సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమయ్యాయి.
ఇలా రకరకాల కారణాలతో గ్రామ పంచాయతీలు, అందులో వార్డులు, ఎంపీటీసీ స్థానాల జాబితాలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి.
దీంతో అధికారులు ఒక్కోసారి అయోమయానికి గురవుతున్నారు. ఒక సారి తుది జాబితాను ఖరారు చేస్తే ఆ జాబితా సంఖ్యకు అనుగుణంగా సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది.
ఇందులో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే మొత్తం ఎన్నికల నిర్వహణపైనే ప్రభావం పడుతుంది. ఇతర పార్టీల నుంచి విమర్శలు సైతం వచ్చే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
జాబితాకు కలెక్టర్లను బాధ్యులుగా చేస్తూ వారి ద్వారానే తుది జాబితాకు చర్యలు చేపట్టారు. దీంతో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని జాబితాను పంపిస్తారనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
29న జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వివరాలు కేబినెట్ ముందు ఉంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తమ వైపు ఎలాంటి లోపం లేకుండా ఉండాలనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.