
శ్రీచైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం..
రాజమండ్రిలోని ఓ కార్పోరేట్ స్కూల్లో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. సాధారణంగా ర్యాగింగ్ అనగానే కాలేజీలు గుర్తుకొస్తాయి.
కానీ ఆశ్చర్యకరంగా స్కూల్లోనే ఈ ర్యాగింగ్ భూతం తలెత్తి, ఒక విద్యార్థి ప్రాణాలపై బారిన పడే స్థాయికి వెళ్లడం తల్లిదండ్రులను షాక్కు గురిచేసింది. కోనసీమ జిల్లా శంకరగుప్తం గ్రామానికి చెందిన గుర్రం విన్సెంట్ ప్రసాద్ అనే పదో తరగతి విద్యార్థి శ్రీచైతన్య స్కూల్లో చదువుతున్నాడు.
మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అయితే, హాస్టల్లో సీసీ కెమెరాను కొందరు విద్యార్థులు తీసేయడంతో ప్రిన్సిపాల్ వారిని నిలదీశారు. ఆ సమయంలో నిజం చెప్పిన విన్సెంట్ ప్రసాద్పై ఆ ఇద్దరు విద్యార్థులు కక్ష కట్టి దారుణంగా దాడి చేశారు.
ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశావని ఐరన్ బాక్స్తో విన్సెంట్ ప్రసాద్ పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. తీవ్ర గాయాలతో బతిమాలుకున్నా కూడా ఎవరికి చెప్పకుండా భయంతో మౌనం వహించాడు.
కానీ గాయాలు తీవ్రంగా మారడంతో తల్లిదండ్రులకి విషయం తెలిసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రసాద్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి చదివిస్తున్నా యాజమాన్యం పిల్లల భద్రత పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ర్యాగింగ్ను నిరోధించాల్సిన స్కూల్ హాస్టల్లోనే ఇలాంటి అమానుష ఘటన జరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.