
ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్… ఉపాధ్యాయ అర్హతా టెట్ తప్పనిసరి..
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకం కావాలంటేనే కాదు.. ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలన్నా.. పదోన్నతులు పొందాలన్నా.. ఇక ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) తప్పనిసరి.
దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వోపాధ్యాయులుగా కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సిందే అని స్పష్టం చేసింది.
ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. అర్హత సాధించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. పదవీ విరమణకు ఐదేళ్ల లోపున్న ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
అయితే, వారు కూడా పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత సాధించాల్సిందే. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలనుకునే వారికి టెట్ పరీక్ష తప్పనిసరి చేస్తూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2010లోనే నిబంధన విధించింది.
ఉమ్మడి రాష్ట్రంలో 2012లో నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు తొలిసారి టెట్ తప్పనిసరి చేశారు. ప్రస్తుత సుప్రీం తీర్పు ప్రభావం రాష్ట్రంలో 2012కు ముందు ఉద్యోగంలో చేరిన దాదాపు 30వేల మంది ఉపాధ్యాయులపై పడనుంది.