
తెల్లారితే కుమార్తె వివాహం.. అంతలోనే తండ్రి..
తెల్లారితే కూతురు పెళ్లి.. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట్ వేశారు. బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. అంతలోనే అందిన ఓ విషాద వార్త అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది.
వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్దులో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. గ్రామానికి చెందిన అండాల అనంతప్ప(46)కు వ్యవసాయమే జీవనాధారం. ఇతని మొదటి భార్య శాకమ్మకు ఓ కూతురు, కొడుకు సంతానం.
పదిహేనేళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకోగా, ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరుకే చెందిన భరత్కు ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు.
ఆదివారం(నేడు) వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. చిన్నచిన్న పనుల నిమిత్తం శుక్రవారం సాయంత్రం యాలాల మండల కేంద్రానికి వెళ్లి, తిరిగి వస్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి, కిందపడ్డాడు.
తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాం«దీకి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలియడంతో గ్రామమంతా విషాదం అలుముకుంది.



