
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉస్మానియా వర్సిటీ డీఈఈ
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో మంగళవారం (డిసెంబర్ 16) ఏసీబీ సోదాలు నిర్వహించింది.
బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఓయూ మానేరు హాస్టల్లో ఓ కాంట్రాక్టర్ సివిల్ వర్క్స్ చేశాడు. రూ.14 లక్షల బిల్లుల కోసం డీఈ శ్రీనివాస్కు దరఖాస్తు చేసుకున్నాడు.
బిల్లులు సాంక్షన్ కావాలంటే రూ.11 వేలు లంచం ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను డీఈ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు.
దీంతో వారం రోజుల కింద ఫోన్ పే ద్వారా రూ.5 వేలు పంపాడు కాంట్రాక్టర్. మరో రూ.6 వేల కోసం శ్రీనివాస్ డిమాండ్ చేయగా.. కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ సూచన మేరకు మంగళవారం (డిసెంబర్ 16) డీఈ శ్రీనివాస్కు రూ.6 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో రెండు నెలల్లో రిటైర్డ్ కానున్న డీఈ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడటం గమనార్హం.



