
అభివృద్ధిలో ‘పాలేరు’ రాష్ట్రానికే దిక్సూచి కావాలి!
ఏదులాపురం లక్ష్యం.. ‘నంబర్ వన్’ సంకల్పం!
- కాంగ్రెస్ను గెలిపించండి.. ఏదులాపురం ప్రగతికి మంత్రి పొంగులేటి గ్యారెంటీ!
- నారీ శక్తికి నీరాజనం.. పాలనలోనూ మహిళలకే అగ్రతాంబూలం!
- రూ. 62.77 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం : పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ‘నంబర్ వన్’ గా తీర్చిదిద్దేందుకు మంత్రి పొంగులేటి కృషి చేస్తున్నారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
178 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ఖమ్మం రూరల్ మండలంలోని 105 మంది లబ్ధిదారులకు రూ. 32,63,000 విలువైన చెక్కులను, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 73 మంది లబ్ధిదారులకు రూ. 30,14,000 విలువైన చెక్కులను అందజేశారు.
అభివృద్ధి బాధ్యత మంత్రి పొంగులేటిది!
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తే, ఆ ప్రాంతాన్ని రాష్ట్రం యావత్తు గర్వించేలా అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి పొంగులేటి స్వయంగా తీసుకుంటారని భరోసా ఇచ్చారు.
మహిళా సాధికారతకు కాంగ్రెస్ కృషి మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్వచనం చెబుతోందని దయాకర్ రెడ్డి కొనియాడారు.
బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆగకుండా, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను సైతం మహిళలకే అప్పగించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
కేవలం ఓటర్లుగానే కాకుండా, మహిళలను పాలకులుగా చేయాలన్న సంకల్పంతోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో చైర్మన్ సీట్లలో మెజారిటీ స్థానాలను వారికే రిజర్వ్ చేసినట్లు గుర్తుచేశారు.
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



