
కాలిబూడిదైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు… బస్సులో మంటలు, ముగ్గురు మృతి..
36మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో.. శభాష్ డ్రైవరన్న
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.. బస్సు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను దాటింది.
ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు వ్యాపించాయి..
అయితే మంటలు ఎగిసిపడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న డీసీఎం వాహన డ్రైవర్ వెంటనే స్పందించాడు. తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగులగొట్టి ప్రయాణికులను బయటకు రావాలని సూచించాడు.
దీంతో ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే కిటికీల నుంచి దూకే క్రమంలో పదిమందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంటలు తీవ్రతరం కావడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది.
బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు మంటల్లో కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితి. ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన ప్రయాణికులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అదృష్టవశాత్తూ.. అటుగా వెళ్తున్న మరో డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించి బస్సు అద్దాలను పగులగొట్టడంతో అందులోని 36 మంది ప్రయాణికుల్లో పదిమందికి పైగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గతేడాది కర్నూలు సమీపంలో జరిగిన ప్రమాదంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
బస్సులో మంటలు చెలరేగడంతో 19మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాాన్ని నింపింది. ఈ ప్రమాదంలో కూడా బస్సులో మంటలు చెలరేగగా.. డీసీఎం వాహనం డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.



