
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత… మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నగరంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా పటిష్ట చర్యలు
నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు
త్వరలో మరో 2500 ఇందిరమ్మ ఇండ్లు నగరంలో మంజూరు
ఖమ్మం 4వ డివిజన్ నందు నిర్మించిన బాలాజీ నగర్ అర్బన్ పి.హెచ్.సి. భవనాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం, జనవరి -24:
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రి, శుక్రవారం ఖమ్మం 4వ డివిజన్ బాలాజీ నగర్ లో 2 కోట్ల 43 లక్షలతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ రోగాలతో అనేక ఇబ్బందులతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలతో సిబ్బంది ప్రేమ ఆప్యాయతలతో ప్రవర్తించాలని, మన ప్రవర్తనతో రోగి సగం బాధ నయం అవుతుందని అన్నారు. ఆసుపత్రి పరిసరాలలో పచ్చని మొక్కలు పెంచాలని, ఆసుపత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
వైద్య శాఖకు ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు అవసరమైన మేర కలెక్టర్, కమీషనర్ నుంచి నిధులు తీసుకొని ఆసుపత్రి చుట్టు పక్కల పరిశుభ్రత, పారిశుధ్యం పాటించాలని అన్నారు. ఆసుపత్రి అవసరాలకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు, మంత్రుల నుంచి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న సిబ్బంది ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్ నందు వైద్య సేవలు కోసం కేటాయించాలని, అవసరమైన నూతన పోస్టులు మంజూరు నిమిత్తం ప్రతిపాదనలు పంపితే సంబంధిత వాటిపై చర్చించి మంజూరు చేయిస్తానని అన్నారు.
మంచి విద్య, వైద్య అవకాశాలతో ఖమ్మం ప్రశాంత నగరంగా అభివృద్ధి చెందాలని , విద్య, వైద్య రంగాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని అన్నారు.
2 వేల 200 ఇందిరమ్మ ఇళ్లను ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు ఇచ్చామని త్వరలో మరో 2 వేల 500 ఇండ్లు మంజూరుకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి వీలైనంత వరకు పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తుందని అన్నారు.
13 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తుందని, పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.
గతంలో తాన మంత్రిగా ఉన్నప్పుడు 6000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశానని, వాటిలో పెండింగ్ నిర్మాణాలను కూడా పూర్తి చేసి, రోడ్డు విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో నిర్వాసితుల పేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఖమ్మంలోనే మార్కెట్ వద్ద రోడ్డుపై నివసిస్తున్న 28 పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి రోడ్డు విస్తరణ చేశామని మంత్రి తెలిపారు.
రోడ్డు విస్తరణలో ఎక్కడైనా భవనాలు కోల్పోతే వారికి పది రెట్లు పరిహారం అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలలో గుడిసెలు వేద్దామని అధికారంలో ఉన్న నాయకులు ప్రయత్నించిన అధికారులు ఒప్పుకోవద్దని మంత్రి స్పష్టం చేసారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 2 కోట్ల 43 లక్షలతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. డివిజన్ ప్రజలకే కాకుండా చుట్టు పక్కల ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తామని అన్నారు.
ప్రజలు ప్రతి చిన్న అవసరానికి ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని, చిన్న, చిన్న జ్వరం కేసులు, రక్త పరీక్షలు వంటి సేవలు హెల్త్ సెంటర్ వద్ద తీసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.
స్థానిక జనాభా పరిధిలో గర్భిణులకు సంబంధించి 100 శాతం ఏ.ఎన్.సి. చెకప్ ఇక్కడి నుంచి జరగాలని కలెక్టర్ ఆశా కార్యకర్తలను ఆదేశించారు. ఏ.ఎన్.సి. చెక్ అప్ లతో పాటు ప్రసవాలు, కొత్తగా పుట్టిన శిశువులకు టీకాలు కూడా 100 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో జరిగేలా కృషి చేయాలని అన్నారు.
వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని అన్నారు. మంత్రి సూచనలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నగరంలో అవసరమైన మేర నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రామారావు, స్థానిక కార్పొరేటర్ డి. జ్యోతి రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



