
నా రక్త సంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వను…నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటా
మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని వార్డుల నుంచి తరలివచ్చిన పార్టీ ఇంచార్జీలు, ముఖ్య నాయకులకు, ఆశావాహులకు దిశానిర్దేశం చేశారు.
శివరాత్రి లోపు ఎన్నికలు, కౌంటింగ్, ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా పూర్తయ్యే అవకాశం ఉంది. సమయం తక్కువగా ఉన్నందున పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం
ఏదులాపురం, ఇల్లెందుల అభివృద్ధికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను కేటాయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో మరింత భారీగా నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పార్టీ బలపరచిన అభ్యర్ధులను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి అని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం.
వారసత్వ రాజకీయాలకు చోటు లేదు. నా రక్త సంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వను. ఇప్పటికే రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కార్యకర్తలే నా బలం : టికెట్ల కేటాయింపులో ప్రతి వార్డులో ప్రజల ఆమోదం, అభ్యర్థి యోగ్యత ఆధారంగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించి, ఆ నివేదికల ప్రకారమే బి-ఫామ్ ఇవ్వడం జరుగుతుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ పట్ల విధేయత, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది అని స్పష్టం చేశారు.
టికెట్ రాని వారు నిరాశ చెందవద్దు. అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడవద్దు. అటువంటి వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది అని హితవు పలికారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది …
అధికారంలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కో-ఆప్షన్ సభ్యులుగా లేదా ప్రభుత్వంలోని ఇతర పదవుల ద్వారా ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. కావున పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అని సూచించారు.
‘కార్యకర్తలే నా బలం, వారి కష్టమే నాకు గౌరవం. నేను ఎప్పుడూ వారిని విస్మరించను. నన్ను నమ్ముకున్న వారికి అండగా ఉంటూ నా కుటుంబసభ్యులుగా కాపాడుకుంటాను’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.




