
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్
సోషల్ మీడియా క్రేజ్, రీల్స్ మోజు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగానికి ఎసరు పెట్టింది.
తరగతి గదిలో పాఠాలు బోధించాల్సిన సమయంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ప్రైవేటు వ్యాపార సంస్థలను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ టీచర్ గౌతమిని అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లాలోని మామిళ్ళగూడెం ప్రభుత్వ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న గౌతమి, తాను తెలియక రీల్స్ చేశానని, వృత్తికి ఎప్పుడూ ద్రోహం చేయలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన రీల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో, గౌతమి క్షమాపణ కోరారు.
అయితే, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్ పట్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో తనను అన్యాయంగా ట్రోల్ చేస్తున్నారని, దీనివల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని ఆమె ఆవేదనతో తెలిపారు. తెలియక తప్పు చేశాను.
నన్ను క్షమించి ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఎవరినైనా హత్య చేశానా? లేక గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఏమైనా విక్రయించానా? ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది’ అంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రైవేటు విద్యాసంస్థలు, కమర్షియల్ బ్రాండ్ల ప్రమోషన్ల కోసం యాడ్స్ చేయడం, పాఠశాల సమయంలో విద్యార్థులను గాలికి వదిలేసి రీల్స్ చేయడంపై గౌతమిపై గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి.
ఈ విషయమై ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదని సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అధికారుల సీరియస్ వార్నింగ్ : ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను విస్మరించి, సొంత పనులకు, సోషల్ మీడియాకు సమయం కేటాయిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని సూచించారు. మరోవైపు, గౌతమి ఆవేదనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాతైనా బుద్ధిగా పిల్లలకు పాఠాలు చెప్పాలని, రీల్స్ మోజులో పడి బాధ్యతను విస్మరించవద్దని కొందరు సూచిస్తుండగా.. మరికొందరు మాత్రం ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.



