
ఖబడ్డార్.. మేం నక్సలైట్లనే ఎదురించాం.. పోలీసులకు, ఎమ్మెల్యేకు బండి సంజయ్ వార్నింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. అంజని నగర్, తిప్పాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీరును, పోలీసుల ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తుంటే.. పోలీసులు ఆయనకు వంతపాడటం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘మేము చేస్తున్న విజ్ఞప్తిని మా చేతగానితనంగా భావించవద్దు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే నేను వేములవాడలోనే తిష్ట వేస్తాను. అప్పుడు డీజీపీ, ఎస్పీలే ఇక్కడికి రావాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. తాము గతంలో నక్సలైట్లతోనే పోరాడామని.. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు , సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరిసిల్ల సీఐ కృష్ణ ప్రవర్తనపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓవరాక్షన్ చేయడం సరికాదని, సదరు అధికారిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని.. అవసరమైతే ఎస్పీ ఆఫీసును, పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని తేల్చి చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు సీట్లకే పరిమితం కాబోతోందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
ఓటమి భయంతో ఉన్న ఫ్రస్ట్రేషన్లోనే పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అహంకారపూరిత వైఖరిని వీడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని హితవు పలికారు.


