
రైలు కింద పడి చీఫ్ ఇంజినీర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..!
విశాఖపట్నం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఓ యువ ఇంజినీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజినీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హర్షవర్ధన్ (36) బుధవారం ఉదయం ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు.
హర్షవర్ధన్ బుధవారం ఉదయం ఇంట్లో ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టి బయటకు వెళ్లారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొనడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గాలిస్తుండగానే, దువ్వాడ రైల్వే స్టేషన్లో విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు హర్షవర్ధన్గా గుర్తించారు. హర్షవర్ధన్ బలవన్మరణానికి కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



