
దోమల దండయాత్రతో వణికిపోతున్న ఏన్కూరు మండలం
పారిశుద్ధ్యం మరిచిన పాలన – ప్రజల ప్రాణాలతో ఆట
అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు – వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 06 2026: ఏన్కూరు మండలంలో దోమల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడంతో చెత్త కుప్పలు, నిల్వ నీరు పెరిగి దోమలు విపరీతంగా వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది.
మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీలు మూసుకుపోయి మురుగునీరు నిల్వ ఉండటం, కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్తను సకాలంలో తరలించకపోవడం వల్ల దోమల సమస్య మరింత తీవ్రమైంది. దోమల కారణంగా వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇంతటి సమస్య ఉన్నప్పటికీ మండల అధికారులు, సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన బాధ్యత ఉన్నా అధికారులు కేవలం పేరుకే సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఫాగింగ్ నిర్వహించకపోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడం, చెత్తను తొలగించకపోవడం వల్ల ప్రజలు దోమల దాడితో ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.
పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. పంచాయితీ స్థాయిలో సకాలంలో పారిశుద్ధ్య పనులు జరగకపోవడం వల్ల పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయడం, నిల్వ నీటిని తొలగించడం, ఫాగింగ్ నిర్వహించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, చెత్తను తరలించడం వంటి చర్యలు వెంటనే చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యను నిర్లక్ష్యం చేస్తే పెద్దఎత్తున వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.




