
పరిగిలో ఉద్రిక్తత.. బోగస్ ఓట్లంటూ కాంగ్రెస్, BRS శ్రేణుల వాగ్వాదం
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పట్టణంలోని 13వ వార్డు 27వ పోలింగ్ కేంద్రం వద్ద అధికార కాంగ్రెస్ మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
పోలింగ్ సజావుగా సాగుతున్న సమయంలో, కాంగ్రెస్ నాయకులు బోగస్ ఓట్లు వేయిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి.
బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ వర్గీయులు ధీటుగా స్పందించారు.
తాము ఎలాంటి బోగస్ ఓట్లు వేయించడం లేదని, స్థానిక ఓటర్లే తమ వెంట తెచ్చుకున్న ప్రభుత్వ గుర్తింపు కార్డుల ద్వారా నిబంధనల ప్రకారమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వారు వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగి తోపులాట వరకు దారితీసింది.
రంగంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తకుండా అప్రమత్తమైన పోలీసులు, ఇరు పార్టీల నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి పంపివేశారు.
ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పోలింగ్ ప్రక్రియ తిరిగి ప్రశాంతంగా కొనసాగుతోంది.



