
బీఆర్ఎస్కి బిగ్ షాక్.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కేసు నమోదు
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆయనపై కమలాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ప్రస్తుతం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పాటు, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించిన ఘటనపై కూడా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ సీపీ వెల్లడించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కమలాకర్తో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి.
ఘటన వివరాలిలా.. కరీంనగర్లోని కిసాన్ నగర్ ప్రాంతంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జంపయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.
ప్రాథమిక విచారణలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమలాకర్ పోలీసుల చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
జంపయ్యను పోలీస్ జీప్లో నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చినట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని ఇలా విడిపించడం చట్ట విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్ సీపీ ఏమన్నారంటే.. ఈ ఘటనపై కరీంనగర్ సీపీ స్పందించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గంగుల కమలాకర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడం, తమ అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్ట ప్రకారం విచారణ కొనసాగుతోందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. జంపయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదు వివరాలు, డబ్బుల పంపిణీపై ఆధారాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రాజకీయంగా ఉద్రిక్తత.. ఈ ఘటనతో కరీంనగర్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
బీఆర్ఎస్ వర్గాలు ఈ చర్యలను రాజకీయ కక్షసాధింపు చర్యలుగా అభివర్ణిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున నగరంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.



