
మానవత్వం మంట కలిసిన వేళ. కసాయిగా మారిన కన్న కూతుర్లు..
కన్నతండ్రి సంపాదించిన ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకుని ఆయనకు తిండి పెట్టకుండా బయటకు గెంటేసిన ఘటన సికింద్రాబాద్లోని మారేడుపల్లి లక్ష్మీనగర్లో బుధవారం రాత్రి కలకలం రేపింది. తాను పంచి ఇచ్చిన ఆస్తులను తనకు తిరిగి ఇప్పించి, కుమార్తెల వేధింపుల నుంచి తనను రక్షించాలని కోరుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ వెస్ట్మారేడుపల్లికి చెందిన ఎం రాజలింగం (70) కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
వారిలో పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మి ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా, రెండో కుమార్తె ఝాన్సీ మెడికల్ డిపార్టుమెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన భార్య మరణానంతరం ఆ ఇద్దరు బిడ్డలు తన ఆస్తులు పంచుకుని, తనను పట్టించుకోవడం లేదని రాజలింగం ఆరోపిస్తున్నారు.
ఇద్దరు కుమార్తెలకు తన 130 గజాల ఇంటి జాగాలో చెరో 65 గజాలు, తన భార్య 15 తులాల బంగారం చెరో ఏడున్నర తులాలు ఇచ్చానని రాజలింగం చెబుతున్నారు. పెద్ద కుమార్తె ఇంటిలో మూడు గదులు ఉన్నా తనను బాత్రూమ్ దగ్గర ఉన్న ఒక గదిలో బందీని చేశారని, మిగతా గదులకు తాళాలు వేసుకుంటారని ఆయన ఆరోపించారు.
రెండో కుమార్తె ఝాన్సీ ప్రభుత్వం ఉద్యోగం ఉన్నా, తాను ఇచ్చిన ఆస్తిపై నెలకు రూ.22 వేల అద్దె వస్తున్నా తనకు కేవలం నెలకు రూ.1500 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని రాజలింగం చెప్పారు. మూడో కుమార్తె ఉందని చెప్పిన రాజలింగం ఆమె గురించి వివరాలు వెల్లడించలేదు.
తనను నిర్లక్ష్యం చేస్తూ వేదనకు గురిచేస్తున్న ఇద్దరు బిడ్డల నుంచి తన ఆస్తులను తిరిగి ఇప్పించాలని ఆర్డీవోను కోరారు. తన పెద్దల్లుడు అప్పుల పేరుతో ఇంటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.



