
డిగ్రీ పాసైతే చాలు.. డైరెక్ట్ GPO పోస్టులు
Web desc : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ.. భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్తగా ‘గ్రామ పాలన ఆఫీసర్’ పోస్టులను సృష్టిస్తూ, ఏకంగా 10,954 పోస్టుల భర్తీకి విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు పోను, మిగిలిన సింహభాగం పోస్టులను ‘డైరెక్ట్ రిక్రూట్మెంట్’ పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు విద్యార్హతను ప్రభుత్వం ‘డిగ్రీ’గా నిర్ణయించింది.
ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడే అవకాశం కల్పించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలని.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్ల సడలింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అయితే, పాత వీఆర్వోలు, వీఆర్ఏల విషయంలో మాత్రం అర్హతల్లో వెసులుబాటు కల్పించారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న మాజీ వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్న మాజీ వీఆర్ఏలను ‘బదిలీ’ పద్ధతిలో ఈ పోస్టుల్లోకి తీసుకుంటారు.
వీరికి డిగ్రీ లేకపోయినా.. ఇంటర్మీడియట్ పాసై ఉండి.. వీఆర్వో, వీఆర్ఏగా ఐదేండ్ల అనుభవం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే సుమారు 5 వేలకు పైగా పోస్టులు బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కలెక్టర్లే సుప్రీం..
ఈ పోస్టుల నియామకం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా జిల్లాలకే అప్పగించింది. జిల్లాను ఒక యూనిట్ గా పరిగణించి నియామకాలు చేపడతారు.
ఈ పోస్టులకు సంబంధించి ‘అపాయింటింగ్ అథారిటీ’ (నియామక అధికారి)గా ఆయా జిల్లాల కలెక్టర్లకే అధికారం కట్టబెట్టారు. కేవలం నియామకాలే కాకుండా.. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఉంటుంది.
విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు రెండేండ్లలోపు నిర్ణీత డిపార్ట్మెంటల్ పరీక్షల్లో (రెవెన్యూ సర్వే, విలేజ్ మాన్యువల్ తదితర అంశాల్లో) ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పాస్ అయితేనే సర్వీసులో కొనసాగుతారు. లేదంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
కొత్తవారికి మూడేండ్లు ప్రొబేషన్
కొత్తగా ‘గ్రామ పాలన ఆఫీసర్’గా విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే రెండేండ్ల ప్రొబేషన్ కాకుండా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొబేషన్ కాలాన్ని ‘మూడేండ్లు’గా నిర్ణయించారు. వీరి పనితీరును మూడేండ్ల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
అదే సమయంలో బదిలీపై వచ్చే పాత ఉద్యోగులకు మాత్రం ఏడాది పాటే ప్రొబేషన్ ఉంటుంది. అంతేకాకుండా, ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే ముందే ప్రభుత్వానికి తప్పనిసరిగా ‘బాండ్’ రాసివ్వాల్సి ఉంటుంది.
శిక్షణ పూర్తి చేసుకుని, నిర్ణీత కాలం పాటు కచ్చితంగా సర్వీసులో కొనసాగాలి. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం మానేస్తే.. శిక్షణకు ప్రభుత్వం చేసిన ఖర్చుతో పాటు, అప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలను వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.



