
మహాశివరాత్రి రోజు విషాదం…
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య.. గుడికి వెళుతున్న సమయంలో ఘటన
జగిత్యాల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. అక్రమ సంబంధం వివాదమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక సమాచారం. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలోని బైపాస్ వద్ద గల కరీంనగర్ డెయిరీ ఎదుట విశ్వనాథ్ అనే వ్యక్తిని బహిరంగంగా కర్రలతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఇవాళ(ఆదివారం) సంచలనం సృష్టించింది.
జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో విశ్వనాథ్కు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.
ఆ మహిళకు 12 సంవత్సరాల క్రితమే వివాహం జరగగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఆ మహిళ ఆమె భర్త దాడికి పాల్పడి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా గుడికి వెళుతున్న సమయంలో, సాయి బాబా బైపాస్ వద్ద ఆటోలో వచ్చి కర్రతో దాడి చేసి విశ్వనాథ్ను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



