
ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రహీం అనే యువకుడితో సాగిన ప్రేమ వ్యవహారం విఫలమవ్వడం, అతడి నుంచి ఎదురైన వేధింపుల కారణంగానే మీనాక్షి అనే యువతి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాసరెడ్డి, రమణమ్మ దంపతుల కుమార్తె మీనాక్షి తన నివాసంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. శుక్రవారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా, తమ్ముడు కళాశాలకు వెళ్లాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకున్న మీనాక్షి, రహీం బెదిరింపులతో కలిగిన మనస్తాపంతో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
తల్లిదండ్రుల ఆవేదన . సాయంత్రం పని ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు, విగతజీవిగా వేలాడుతున్న కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు.
ప్రేమ పేరుతో వేధించిన రహీం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.



