
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ*హత్య
నిర్మల్ జిల్లాలోని ప్రఖ్యాత బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT)లో మరోసారి విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం (E2) చదువుతున్న వసంత అనే విద్యార్థిని క్యాంపస్లో ఆత్మ*హత్యకు పాల్పడింది.
ఈ ఘటనతో తోటి విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు.
ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కారణాలపై పోలీసుల దర్యాప్తు కాగా.. గతంలోనూ బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదువుల ఒత్తిడి భరించలేకనే వారు చనిపోయినట్లు సూసైడ్ నోట్ల ద్వారా పోలీసులు ధృవీకరించారు.
స్వాతిప్రియ అనే పీయూసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని 2024 నవంబర్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్ నోట్ లో ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే చనిపోతున్నట్లు రాసినట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు.
అదే ఏడాది ఏప్రిల్ లో అరవింద్.. పరీక్షలకు రెండ్రోజుల ముందు సూసైడ్ కు పాల్పడ్డాడు. హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఇంటికి సమాచారం వెళ్తుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.



