
జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 26 2026: మండల పరిధిలోని జన్నారం రైతు వేదికలో వైరా డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు టి. కరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో రసాయనిక ఎరువుల వినియోగం అధికమవడంతో సాగు ఖర్చులు పెరగడమే కాకుండా నేల సారానికి కూడా నష్టం జరుగుతోందని తెలిపారు.
రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, అదే సమయంలో స్థిరమైన మరియు నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చని వివరించారు.
ప్రకృతి వ్యవసాయం అనుసరించడం వలన నేల ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘకాలంలో భూమి మరింత సారవంతంగా మారి రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు భూసార పరీక్షల విశ్లేషణ పత్రాలను పంపిణీ చేశారు. రైతులు తమ భూములలోని పోషక విలువలను తెలుసుకొని, వాటికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని అధికారులు సూచించారు.
అదేవిధంగా కెవికె శాస్త్రవేత్త ఫణి శ్రీ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ఆవు మూత్రం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి జీవన ఎరువుల తయారీ విధానాలను రైతులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సహజ ఎరువులను రైతులు స్వయంగా తయారు చేసుకొని వినియోగించడం ద్వారా పంటల ఉత్పాదకతను పెంచుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎ. నరసింహారావు, వ్యవసాయ విస్తరణ అధికారులు నవ్య, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ప్రకృతి వ్యవసాయం పై అవగాహన పొందారు.



