
తెలంగాణలో భూకంపం.. భయందోళనలో జనం
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంగా గురువారం భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.భూకంప లేఖిని ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు.
భూ అంతర్భాగంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ఈ ప్రకంపనలు సంభవించాయని, వీటి ప్రభావం కొన్ని సెకన్ల పాటు కొనసాగిందని ప్రాథమిక సమాచారం అందుతోంది.
కేవలం మంచిర్యాల జిల్లాలోనే కాకుండా, దీని ప్రభావం పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా కనిపించింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు కూడా భూమి ఒక్కసారిగా అదిరినట్లు గుర్తించారు.
ఇళ్లలోని సామాన్లు కింద పడటం, కిటికీలు శబ్దం చేయడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధానంగా పాత భవనాల్లో ఉన్నవారు మరింత ఆందోళనకు లోనయ్యారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) అందించిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం భూమికి సుమారు పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భౌగోళిక పొరలలో కలిగిన ఒత్తిడి కారణంగా ఇలాంటి స్వల్ప స్థాయి భూకంపాలు సంభవిస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
అయితే, రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత అనేది మధ్యస్థమైనది కావడం వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం సూచించింది.
భూప్రకంపనలు వచ్చిన సమయంలో ఆందోళన చెందకుండా, సురక్షిత ప్రాంతాలకు లేదా ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో చిన్నపాటి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందేమోనని భూకంప నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది.



