
ఆరు రోజుల తర్వాత చెరువులో తేలిన శవం..
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్లోని లక్ష్మీనారాయణ చెరువులో గత నెల 24న (మంగళవారం) గల్లంతైన సచిన్ ఎ దేశ్పాండే ఆదివారం చెరువులో శవమై కనిపించాడు.
స్థానికుల కథనం ప్రకారం… లక్ష్మీనారాయణ చెరువు కట్ట వద్ద ఏపీ 10 ఏఎక్స్ 1897 హీరో సీబీజెడ్ మోటార్ బైక్ అనునాస్పదంగా పార్కు చేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఘట్కేసర్ పోలీసులకు సమాచారం అందించగా.. బైక్లో లభించిన ఆధార్ కార్డు ద్వారా సచిన్ ఎ దేశ్పాండేగా గుర్తించారు. అంతే కాకుండా సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు పరిశీలించగా..
సచిన్ చెరువు వద్దకు చేరుకున్నట్టుగా సీసీటీవీ రికార్డులో తేలింది. ఆ రోజు నుంచి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు చెరువులో గాలిస్తూనే ఉన్నారు.
ఆదివారం మర్పల్లిగూడ శివారు లక్ష్మీనారాయణ చెరువులో శవమై కనిపించాడు. సీసీటీవీ ఫుటేజ్ లో యువకుడు వేసుకున్న దుస్తుల ఆధారంగా శవమై కనిపించిన యువకుడిపై ఉన్న దుస్తులు ఒకే విధంగా ఉండటంతో మృతుడు సచిన్ అని గుర్తించారు.
సచిన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, అతనిపై మలక్పేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. గత ఆరు రోజులుగా చెరువులో గల్లంతైన యువకుడు శవమై లభించడంతో ఉత్కంఠ వీడింది.




