
ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. మార్చురీలోకి చొరబడి శవాన్ని పీక్కుతిన్న కుక్కలు!
Web desc : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచిన శవాన్ని కుక్కలు పీక్కుతున్న దృశ్యాలు స్థానికులను షాక్కు గురిచేశాయి.
మార్చురీ గది తలుపులు సక్రమంగా మూయకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల కుక్కలు లోపలికి చొరబడ్డాయని తెలుస్తోంది. వివరాల్లోకెళ్తే.. జడ్చర్ల మండల పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేష్ (32)శనివారం రోజు ఉదయం ఇంట్లో నుండి బహిర్భూమి కొరకు అని వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికిన లాభం లేకపోయింది. కాగా సోమవారం ఉదయం నాగసాల గ్రామంలోని చెరువులో భీమేష్ మృతదేహం నీటిపై తేలియాడుతూ, కనబడడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుండి బయటకు తీసి జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడ మార్చురీలో భీమేష్ మృతదేహాన్ని ఉంచి, గదికి సరిగ్గా తలుపులు మూయకపోవడంతో కుక్కలు లోనికి ప్రవేశించి భీమేష్ మృతదేహాన్ని పీక్కుతిన్నాయి.
మానవత్వాన్ని సిగ్గుపడేలా చేస్తున్న ఘటన. ఈ ఘటనను ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె అందుకు స్పందించకపోగా.. దృష్టికి తీసుకెళ్లిన వారి పైనే విరుచుకుపడడం విడ్డూరంగా ఉంది..
సంఘటనను ప్రశ్నించిన వారిపైనే విరుచుకుపడుతూ “ఇది పెద్ద విషయం కాదు” అన్నట్లుగా వ్యవహరించడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది.
మనిషి చనిపోయాక కూడా కనీస గౌరవం లేకుండా ఇలా జరగడం మానవత్వానికే మచ్చ” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చురీ గదికి భద్రతా సిబ్బంది లేరా? సీసీ కెమెరాలు పనిచేయడం లేదా? ఆసుపత్రి అధికారుల బాధ్యత ఎక్కడ? ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఘటన మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ప్రజలు, ప్రజా సంఘాలు వెంటనే జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మానవత్వం మట్టిపాలు అవుతున్నదా? లేక బాధ్యులపై చర్యలతో వ్యవస్థలో మార్పు వస్తుందా? అనే విషయం మీద జడ్చర్ల ప్రజలు ఇప్పుడు సమాధానం కోరుతున్నారు.
స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇన్చార్జి జిల్లాలోనే ఇలా జరుగితే ఎలా..? మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న జిల్లాలోనే, ఆయన శాఖకు సంబంధించిన ఆసుపత్రిలోనే ఇంత దారుణమైన ఘటన జరగడం ఏంటని.. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి ఇప్పటికైనా నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీని ప్రారంభించి.. సరైన వసతులు కల్పించి, అనంతరం ఆయన గౌరవం దక్కేలా చూడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.




