
ప్రేమ విఫలం.. పురుగుల మందు తాగిన యువకులు
Web desc : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని శాలి లింగోటం గ్రామంలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..
గ్రామానికి చెందిన కోనేటి అఖిల్, లోడే పవన్ అనే ఇద్దరు స్నేహితులు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించారు. అనంతరం వారు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, యువకుల పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నల్లగొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ మృత్యువుతో పోరాడుతున్నారు.
కారణాలపై ఆరా . ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం ‘లవ్ ఫెయిల్యూర్’ (ప్రేమ వ్యవహారం) కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
కుటుంబ కలహాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. హోలీ పండుగ మరుసటి రోజే గ్రామంలో ఈ ఘటన జరగడంతో శాలి లింగోటంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



