
హోం మంత్రి కి అస్వస్థత… ఆస్పత్రికి తరలింపు
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శాసనసభ సమావేశాల్లో చర్చ సాగుతుండగా ఆమె ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యారు.
వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమై.. ఆమెను అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ అయిన రమేష్ ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్య స్థితి : హూంమంత్రి అనితను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వెంటనే వైద్యులు అత్యవసర పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఆమె బ్లడ్ ప్రెజర్ (బీపీ) ఒక్కసారిగా పెరిగి 160కి చేరినట్లు వైద్యులు గుర్తించారు.
అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. బీపీలో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్లనే ఆమెకు నీరసం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయని తెలిపారు.
కాగా ప్రస్తుతం వైద్యులు ఆమెకు అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
అస్వస్థతకు కారణం : హూంమంత్రి అనిత గత కొంతకాలంగా బిజీ బిజీ పనులలో పాల్గొంటూ తీరిక సమయం లేకుండా గడుపుతున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు శాఖాపరమైన సమీక్షలు, వరుస పర్యటనలతో బిజీ బిజీ అయ్యారు.
దీంతో సరైన విశ్రాంతి లేకపోవడం వల్లే ఆమెకు నీరసం, అలసటకు గురైనట్లు ఆమె వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కాగా ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని సమాచారం.




