
మహిళల గౌరవం – సమాజ అభివృద్ధికి పునాది
ఏన్కూరు గురుకుల పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 07 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏన్కూరు మండలంలోని గురుకుల బాలుర పాఠశాల–కళాశాలలో శనివారం ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ వేము రాజు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేము రాజు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. కుటుంబం నుండి దేశ అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు విశేషంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు మహిళల పట్ల గౌరవభావం కలిగి ఉండి సమానత్వాన్ని కాపాడాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఏటీపీ ఓ. శ్రీను మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సక్రమంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలపై వివక్ష, హింస వంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడుతూ మహిళలు విద్యా రంగం, ఉద్యోగ రంగం, క్రీడలు, రాజకీయాలు వంటి అనేక రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. విద్యార్థులు మహిళల పట్ల గౌరవంతో ప్రవర్తిస్తూ మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మహిళా సాధికారత, సమానత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులచే మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఈ సందర్భంగా పాఠశాలలో సేవలు అందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. మహిళా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు మంచి విలువలతో ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముందస్తు మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.



