
మూడేళ్ళ చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి
Web desc : విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్లో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం మూడేళ్ల వయసున్న ఎల్కేజీ విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయురాలు అత్యంత క్రూరంగా యాసిడ్తో దాడికి పాల్పడింది. అనంతరం బాత్రూమ్లో పడిపోయిందని పేరెంట్స్కి ఫోన్ చేశారు.
చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలీవిధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన పాప తల్లి తన కూతురిని యథావిధిగా స్కూల్ దగ్గర దింపి వెళ్లారు. అయితే, కాసేపటికే స్కూల్ నుండి తల్లికి ఫోన్ వచ్చింది.
మీ పాప బాత్రూమ్ లో పడిపోయింది, దెబ్బలు తగిలాయి అని టీచర్ సమాచారం అందించారు. కంగారుగా స్కూల్కు చేరుకున్న తల్లి, ఏడు స్తున్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
కానీ, ఆసు పత్రిలో వైద్యులు పరీక్షించాక అసలు నిజం బయటపడింది. పాప ఒంటిపై ఉన్న గాయాలు పడిపోవడం వల్ల వచ్చినవి కావు, అవి యాసిడ్ పోయడం వల్ల కలిగిన కాలిన గాయాలని వైద్యులు ధృవీకరించారు.
వైద్యుల మాటలతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. మొదట బుకాయించినప్ప టికీ, గట్టిగా అడిగేసరికి టీచర్ అమానుషంగా పాపపై యాసిడ్ పోసినట్లు యాజమాన్యం అంగీకరించింది.
ఆసుపత్రి బిల్లు కట్టిన యాజమాన్యం, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలని, కొంత డబ్బు తీసుకుని రాజీకి రావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చింది. అయితే, తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురికి జరిగిన అన్యాయంపై రాజీ పడటానికి తల్లిదండ్రులు నిరాకరించారు.
తల్లిదండ్రులు వెనక్కి తగ్గకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ అంతు చూస్తామంటూ తల్లిదండ్రులను బహిరంగంగా హెచ్చరించారు.
అంతటితో ఆగలేదు నగర డిసిపి తమకు బంధువని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితులు భయపడతారనే ఉద్దేశంతో అధికార బలాన్ని చూపిస్తూ యాజమాన్యం ఆడుతున్న ఈ నాటకం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తమ కళ్లముందే చిన్నారి నరకయాతన అనుభవిస్తుంటే, కనీసం జాలి లేకుండా బెదిరింపులకు దిగుతున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవు తున్నారు.
ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన టీచర్ను, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ప్రిన్సిపాల్ను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



