
ఏ కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తెలుసు: మంత్రి పొంగులేటి
తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్లో తనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన సీరియస్ అయ్యారు.
అవుటర్ రింగ్ రోడ్డు పక్కన సంబంధం లేని క్రషర్ నాదని పిచ్చి కుక్కలు చాలా మొరుగుతున్నాయన్నారు. ఏ కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తనకు తెలుసునని చెప్పారు. ఆ క్వారీ నాదని చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు క్రషర్ నడిపే ఓపిక లేదు.. అది తన క్రషర్ కాదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది తిరుమల క్రషర్ అని చెప్పారు. వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ వారికి ఉందని పేర్కొన్నారు. ఆ క్రషర్ కంపెనీ తమ కంటైనర్ తీసుకు వెళ్ళిందన్నారు. దానిపై ఉన్న పేరు వారు తొలగించినట్లు ఉన్నారని వివరించారు.
దానిని పట్టుకుని పిచ్చి వాగుడు వాగుతున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టారు. వెలుగుపట్లలో 410 మంది నిజమైనవారు ఉన్నారని.. 330 మంది బోగస్ అని తేలిందన్నారు.
410 మందికి త్వరలోనే స్థలాలు ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. తనపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతానంటూ బీఆర్ఎస్ నేతలకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.




